తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ రైతు భరోసా నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిధుల పంపిణీకి ముహూర్తం ఖరారు చేశారు.
పథకం అమలు తీరు ఇలా ఉండనుంది:
తొలి విడత (మార్చి 22): ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడతలో భాగంగా సుమారు 70 లక్షల మంది రైతులకు, ఎకరం వరకు భూమి ఉన్న వారికి రూ. 3,590 కోట్ల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు.
రెండో విడత: తొలి విడత పూర్తయిన 20 రోజుల తర్వాత, మరో రూ. 2,650 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తుది విడత: ఏప్రిల్ నెలాఖరు నాటికి మిగిలిన రైతుందరికీ నిధులు అందజేస్తారు.
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి, దాదాపు రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు ఆర్థిక, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొని నిధుల సమీకరణ, పంపిణీపై దిశానిర్దేశం చేశారు. సాగు కాలంలో పెట్టుబడి సాయం అందడం పట్ల రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది.