శుభవార్త.. ఉపకారవేతనాల దరఖాస్తుకి మరో అవకాశం..!
Good news for Students. గత ఏడాది నుంచి కరోనా వైరస్ వల్ల విద్యా వ్యవస్థ అస్త వ్యస్థం అయ్యింది. విద్యార్థులు ఇంటికే
By Medi Samrat Published on 15 Feb 2021 6:33 PM IST
గత ఏడాది నుంచి కరోనా వైరస్ వల్ల విద్యా వ్యవస్థ అస్త వ్యస్థం అయ్యింది. విద్యార్థులు ఇంటికే పరిమితం అయ్యారు. ఆన్ లైన్ క్లాసులు జరిగినా దానిపై చాలా మంది విద్యార్థులు శ్రద్ద చూపించలేకపోయారు. అంతే కాదు కళాశాలకు పంపాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ మద్యనే కళాశాలలు పునఃప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో బోధన రుసుములు, ఉపకారవేతనాల దరఖాస్తు గడువు నేటితో ముగుస్తున్నందున.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ-పాస్ ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు మార్చి 31 వరకు అవకాశం కల్పించింది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తికానందున గడువు పెంచింది. ఈ నిర్ణయంతో సుమారు 5.11 లక్షల విద్యార్థులకు మేలు జరగనుంది.
కరోనా కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలు ఆలస్యమయ్యాయి. ప్రవేశాలు ముగిసినా యూనివర్సిటీలు, సెట్ కన్వీనర్ల నుంచి విద్యార్థుల సమాచారం.. సంక్షేమ శాఖలకు చేరలేదు. ఫలితంగా ఈ ఏడాదిలో కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇప్పటికి 2 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు.
ఏటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు దాదాపు 13 లక్షల మంది బోధన రుసుములు, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటికి కేవలం 8.8 లక్షల దరఖాస్తులే చేరాయి. బోధన రుసుములు పొందేందుకు అర్హత కలిగిన కళాశాలలు 5,117 ఉంటే, 3,059 మాత్రం ఈ-పాస్లో గుర్తింపు వివరాలు నమోదు చేశాయి. మిగతావి ఆ పని చేయకపోవడం వల్ల విద్యార్థులకు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది.