'రైతే రాజు అని మరోసారి రుజువు చేశాం'.. రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అన్నదాతల ఆర్థిక భరోసా కోసం తన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By - అంజి |
'రైతే రాజు అని మరోసారి రుజువు చేశాం'.. రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అన్నదాతల ఆర్థిక భరోసా కోసం తన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామంలో రైతు భరోసా నిధుల విడుదల, పామ్ ఆయిల్ పరిశ్రమ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. అన్నదాత సంతోషం కోసం ఒక అన్నగా తాను బాధ్యత తీసుకున్నానని, రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 70 లక్షల మంది రైతుల కోసం రూ. 9,000 కోట్ల రైతు భరోసా నిధుల పంపిణీకి నేడు శ్రీకారం చుడుతున్నామని సీఎం వెల్లడించారు. తమ పాలనలో 'రైతే రాజు' అనే నినాదాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఆర్థిక సాయం అందించి చేతులు దులుపుకోవడం కాకుండా, రైతులకు శాశ్వత ప్రాతిపదికన ఆదాయం చేకూర్చేలా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించినట్లు చెప్పారు.
అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు…
— Revanth Reddy (@revanth_anumula) March 22, 2026
దీనికి నిదర్శనంగా, కేవలం 17 నెలల స్వల్ప వ్యవధిలోనే సిద్దిపేట జిల్లా నర్మెట్టలో పామ్ ఆయిల్ పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేసి, నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి కొనసాగింపుగా అక్కడే రిఫైనరీ యూనిట్కు కూడా శంకుస్థాపన చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.