మునుగోడు ఉపఎన్నికలో.. విజేతను ఎల్బీనగర్‌ నిర్ణయిస్తుందా?

Do you know what is the relation of LB Nagar to Munugode by-election. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో పెద్ద రచ్చే జరుగుతోంది. దీనిపై అనేక ప్రశ్నలు, సందేహాలు

By అంజి  Published on  25 Oct 2022 8:33 AM GMT
మునుగోడు ఉపఎన్నికలో.. విజేతను ఎల్బీనగర్‌ నిర్ణయిస్తుందా?

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో పెద్ద రచ్చే జరుగుతోంది. దీనిపై అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. మునుగోడుకు ఎల్‌బీ నగర్‌కు లింకేంటి? మూడు ప్రధాన పార్టీల సీనియర్ నేతలు ఇక్కడే ఎందుకు మకాం వేశారు? ఈ ఉప ఎన్నికలో విజేతను ఈ ప్రాంతమే నిర్ణయిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు ఏ ఒక్క ఛాన్స్‌ కూడా వదలడం లేదు. మునుగోడు ఓటర్లు ఉంటున్న స్థలాలను గుర్తించి తమ పార్టీకి ఓటు వేయాలంటూ బహుమతులతో ప్రలోభపెడుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని వేలాది మంది ఓటర్లు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది ఎల్‌బీ నగర్ ప్రాంతంలో ఉంటూ చిన్నచిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. నాయకులు తమ బంధువులు, స్నేహితుల నుంచి వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు సేకరించి ప్రతి ఓటరును కలుస్తున్నారు.

దాదాపు 25 వేల మంది మునుగోడు ఓటర్లు ఎల్‌బీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు సమాచారం. దీంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఈ ప్రాంతంలో మధ్యాహ్న భోజనం, మద్యం సహా సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల నేతలు తమ పార్టీకే ఓటు వేయాలని ఓటర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. ఎన్నిక‌ల ప్ర‌చారం ఎల్‌బీ నగర్‌కే పరిమితం కాలేదు. ముంబైకి కూడా వ్యాపించింది. ఒక సీనియర్ నాయకుడు ముంబైకి వెళ్లి, వలస కూలీలను కలుసుకుని, తన పార్టీకి ఓటు వేయడానికి మునుగోడుకు రావాలని అభ్యర్థించాడు. వారి ప్రయాణానికి అయ్యే ఖర్చు అంతా భరిస్తానని హామీ ఇచ్చారు. అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story