ధరణి అక్రమాలపై 'కోడ్ ఆడిట్'.. తెలంగాణ వ్యాప్తంగా ఫోరెన్సిక్ దర్యాప్తు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

By -  అంజి
Published on : 19 Feb 2026 10:04 AM IST

Dharani Portal Scam, Telangana Land Records, Bhoo Bharati Portal, Code Audit Dharani, Ponguleti Srinivas Reddy

ధరణి అక్రమాలపై 'కోడ్ ఆడిట్'.. తెలంగాణ వ్యాప్తంగా ఫోరెన్సిక్ దర్యాప్తు 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ధరణిలో తలెత్తిన సమస్యలు కేవలం సాంకేతిక లోపాలు కావని, అవి వ్యవస్థాగతంగా సృష్టించిన లోపాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ లావాదేవీల్లో భారీ అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కేవలం సాఫ్ట్‌వేర్ ఎర్రర్స్ (Software Errors) మాత్రమే కాకుండా, కావాలనే లొసుగులను వ్యవస్థలో పొందుపరిచారని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు.

విచారణలో వెల్లడైన కీలక అంశాలు:

నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు లేదా అణచివేసినట్లు విచారణలో వెల్లడైంది. గతంలో ఫోరెన్సిక్ ఆడిట్ జరిగినా, 'కోడ్ ఆడిట్' (Code Audit) జరగలేదని మంత్రి పేర్కొన్నారు. విచారణలో అత్యంత రహస్యంగా ఉండాల్సిన లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు కనుమరుగవ్వడం వంటి ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీ మళ్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు.

రాష్ట్రవ్యాప్త ఆడిట్‌కు ఆదేశం:

ఇప్పటికే సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ తరహాలోనే, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ సంస్థ 'టెర్రాసిస్' (Terrasis) కు పోర్టల్ నిర్వహణను అప్పగించడం వల్ల తలెత్తిన సమస్యలపైనా విచారణ జరగనుంది.

'ధరణి' స్థానంలో 'భూ భారతి':

ధరణిలోని లోపాలను సరిదిద్ది, మరింత పారదర్శకమైన, సురక్షితమైన వ్యవస్థను తీసుకురావడానికి ప్రభుత్వం 'భూ భారతి' పేరుతో సరికొత్త ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది పౌర స్నేహపూర్వకంగా ఉంటూ, అనవసరమైన అధికారుల జోక్యం లేకుండా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. "ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయిని తిరిగి రాబడతాం. అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని మంత్రి హెచ్చరించారు.

Next Story