Devotees flocked to Medaram. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవడానికి మేడారానికి భక్తులు పోటెత్తారు.
By Medi Samrat Published on 21 Feb 2021 1:32 PM GMT
వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవడానికి మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం నాడు వన దేవతలను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. మేడారంలో ఈ నెల 24 నుంచి 27 వరకు ఆనవాయితీగా చిన్న జాతర జరుగనున్న విషయం తెలిసిందే.
ఈ నేఫథ్యంలో చిన్నజాతరకు ముందే ఆదివారం నాడు వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి వనదేవతల సన్నిధికి చేరుకున్నారు. గద్దెలపై సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని పసుపు, కుంకుమ, పువ్వులు, నైవేథ్యం, చీరలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆదివారం సెలవుదినం కావడంతో ఉదయం నుంచే రాష్ట్రం నలుమూలలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా భక్తజనం తరలించారు. ఇదిలావుంటే.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ జాతర సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు గద్దెల మీదకు రావడంతో మొదలయ్యి.. వన ప్రవేశంతో ముగుస్తుంది.