Telangana: పోడు రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. వ్యవసాయానికి సోలార్ పవర్
పోడు రైతులకు వ్యవసాయ పంపుసెట్లను నడుపుకునేందుకు సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.
By అంజి Published on 11 Dec 2024 10:04 AM IST
Telangana: పోడు రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. వ్యవసాయానికి సోలార్ పవర్
హైదరాబాద్: పోడు రైతులకు వ్యవసాయ పంపుసెట్లను నడుపుకునేందుకు సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన రైతులు తమ భూములు సాగు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. పోడు రైతులకు సోలార్ విద్యుత్ యూనిట్లు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు గిరిజన శాఖకు ఆదేశాలు ఇస్తామని భట్టి తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వానికి చెప్పేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తులు సమర్పించిన లబ్ధిదారులు ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషకరమని భట్టి తెలిపారు. దరఖాస్తుల కంప్యూటరీకరణ, వాటిని అధికారులకు పంపి చర్యలు చేపట్టడం పట్ల దరఖాస్తుదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలు ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తున్నాయని, ప్రజాస్వామ్య పాలనకు బలమైన పునాది వేస్తున్నాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిజమైన ప్రజాస్వామ్య విజన్కు అనుగుణంగా పనిచేస్తోంది. రాజ్యాంగానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం చైతన్యంతో పని చేస్తోందన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ఆయన.. తమ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 70 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని అన్నారు. గత ప్రభుత్వం ప్రగతిశీల భావాలకు ఆస్కారం లేకుండా ప్రజలను అణచివేసి భావ ప్రకటనా స్వేచ్ఛను హరించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి పోడు రైతుల సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. ''అందుకే అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. సీఎల్పీ నేతగా ప్రజల కోసం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశాను'' అని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం పునరుద్ధరణతోనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని కాంగ్రెస్ నేతలు ప్రజలకు హామీ ఇచ్చారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అధికారంలోకి తెచ్చారన్నారు.