హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాల వేళ పోస్టర్ల కలకలం

రెండ్రోజుల పాటు CWC సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ క్రమంలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  16 Sep 2023 3:20 AM GMT
CWC Meeting, Hyderabad, posters, congress leaders, scam,

హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాల వేళ పోస్టర్ల కలకలం

సీడబ్ల్యూసీ భేటీకి సర్వం సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 16, 17 తేదీల్లో రెండ్రోజుల పాటు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో దేశ రాజకీయాలతో పాటు.. త్వరలోనే తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం రేపుతోంది.

సీడబ్ల్యూ సమావేశాలు జరుగుతన్న వేళ హైదరాబాద్‌లో 'కరప్ట్‌ వర్కింగ్‌ కమిటీ' పేరుతో పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుల్లో కొందరు ఫొటోలను కూడా ముద్రించారు. కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సభ్యులు.. వారు చేసిన కుంభకోణాలు ఇవే అంటూ వివరాలతో పోస్టర్లు అంటించారు కొందరు. దాంతో.. ప్రజలు వాటిని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ పోస్టర్లలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పేర్లు కనిపిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈపోస్టర్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేషనల్‌ హెరాల్డ్‌ స్కాం అని మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏకే ఆంటోనీ పేర్లను రాశారు. ఇక కోల్‌ అలోకేషన్‌ స్కాం అంటూ మన్మోహన్‌ సింగ్‌ పోస్టర్‌ను వేశారు. దిగ్విజయ్‌ సింగ్, మీరాకుమార్, చిదంబరం, కేసీ వేణుగోపాల్, శశిథరూర్‌ ఇలా ఇంకొందరు కాంగ్రెస్ జాతీయ నాయకుల పేర్లను పోస్టర్లలో ముద్రించారు. మొత్తం 24 మంది కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కామ్‌ల వివరాలతో పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి. అంతేకాదు.. ఫొటోల కింద బీవేర్ ఆఫ్‌ స్కామర్స్‌ (స్కామ్‌లు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి) అని ట్యాగ్‌లైన్‌తో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌కు భయపడే అధికార పార్టీ నాయకులు ఇలాంటి పోస్టర్లు ముంద్రించారంటూ పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. ఏదేమైనా సీడబ్ల్యూసీ సమావేశాల వేళ ఇలాంటి పోస్టర్లు హైదరాబాద్‌ నగరంలో కనిపించడం కలకలం రేపుతున్నాయి.

Next Story