సీఎల్పీ ఎంపిక బాధ్యత ఖర్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు: డీకే శివకుమార్

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది.

By Srikanth Gundamalla  Published on  4 Dec 2023 8:15 AM GMT
congress, mla meeting, dk shivakumar,

సీఎల్పీ ఎంపిక బాధ్యత ఖర్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు: డీకే శివకుమార్

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే బాధ్యతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి అప్పగించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలంతా తీర్మానం చేశారు. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ భేటీకి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొత్తం 64 మంది ఎమ్మెల్యేలు హాజరు అయ్యార. సీఎల్పీ నేత ఎంపికపై ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించారు.

అయితే.. ఈ సమావేవం అనంతరం.. ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామని డీకే శివకుమార్ తెలిపారు. సీఎల్పీ నేతల ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నామని వెల్లడించారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అభిప్రాయంలో తెలిపారని అన్నారు. ఆ మేరకే సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. అయితే.. ఖర్గే నిర్ణయాన్ని తాము శిరసావహిస్తామని ఎమ్మెల్యేలంతా తీర్మానంలో పేర్కొన్నారని డీకే శివకుమార్ చెప్పారు.

దాదాపుగా గంటపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులుగా డీకే శివకుమార్‌తో సహా దీప్‌దాస్‌ మున్షీ, జార్జ్‌, అజయ్‌, మురళీధరన్‌ హాజరయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్‌ను ఎన్నుకుంటారంటూ ఇప్పటికే చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు ఆయన సీఎల్పీ నేత అయితే.. పీసీసీ పదవి ఖాళీగా ఉంటుందననీ.. దాన్ని ఎవరు అధిరోహిస్తారో అన్న చర్చ మరోవైపు నడుస్తోంది. ఒకవేళ రేవంత్‌రెడ్డికి సీఎల్పీ ఇస్తే.. పీసీసీ పదవి కోసం ఐదారుగురు సీనియర్‌ నేతలు ఎదురు చూస్తున్నారు.

Next Story