ధరణి.. సంస్కరణ కాదు సంక్షోభం
Congress Leader Mallu Bhatti Vikramarka Slams CM KCR. రైతులకు ఇచ్చిన అనేక సబ్సిడీలను కోత పెట్టి.. రైతుబంధు పేరుతో కేసీఆర్ మోసం చేస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మండిపడ్డారు.
By Medi Samrat Published on 10 Feb 2021 5:10 PM IST
కడెం : గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన అనేక సబ్సిడీలను కోత పెట్టి.. రైతుబంధు పేరుతో కేసీఆర్ అన్నదాతలను మోసం చేస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మండిపడ్డారు. రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా భట్టి విక్రమార్క ఆద్వర్యంలోని సీఎల్పీ బృందం బుధవారం నాడు కడెం రైతులో మాట్లాడింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమర్క మాట్లాడుతూ.. రైతు బంధు పేరుమీద ప్రభుత్వం ద్వారా రావాల్సిన సహాయాన్ని, సబ్సిడీనికి కేసీఆర్ ప్రభుత్వం ఆపేసిందని రైతులకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మోసాలు ప్రజలకు, రైతులుకు అర్థమవుతోందని చెప్పారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేవలం భూమిదున్నని భూస్వాములకు, వందల ఎకరాల బీడుభూమి ఉన్న ఆసాములకు మాత్రమే రైతు బంధు ఉపయోగపడుతోంది తప్ప.. నిజంగా భూమిని దున్నే రైతులకు ఉపయోగపడడం లేదని బట్టి వివరించారు.
భూమిని నమ్మి పంట పండించే రైతులకు మద్దతు ధరలేక పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని అన్నారు. అంతేకాక గత ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీలు లేక... అన్నదాతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
ఈ ప్రాంతంలో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన సదర్మఠ్ ప్రాజెక్టుకు కుట్రతోనే డిజైన్ మార్చి.. ఈ ప్రాంతవాసులకు నీళ్లు రాకుండా చేశారని భట్టి ఆరోపించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కోసం నిర్మించిన కడెం ప్రాజెక్టు ద్వారా చివరి భూములకు నీళ్లు అందించేలా గత ప్రభుత్వాలు ప్రతి ఏడాది మెయింటెనెన్స్ చేయడం జరిగేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మెయిటెనెన్స్ చేయక పోవడంతో.. కింది ప్రాంత రైతులకు నీళ్లు రావడం లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
కడెం ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం మంజూరు చేసిన 130 మంది ఉద్యోగులను గత కాంగ్రెస్ ప్రభుత్వం నియమిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం101 మందిని తొలగించి.. కేవలం 29 మందితో ప్రాజెక్టు నిర్వహణ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 74 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అలసత్వం వహించడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడెం ప్రాజెక్టును రైతులకు దూరం చేసే ఒక దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని అన్నారు. ధరణితో రైతులందరినీ కేసీఆర్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ధరణి అనేది సంస్కరణ కాదు.. సంక్షోభం అని భట్టి చెప్పారు.
రాష్ట్రంలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాల్లోపు ఉన్నవారే.. వారంతా పండించిన పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎలా అమ్ముకుంటారని భట్టి ప్రశ్నించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు కొనసాగించాలని భట్టి చెప్పారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలు.. దేశ రైతాంగాన్ని వణికిస్తున్నాయని చెప్పారు.