'మునుగోడులో జరిగింది.. ఓట్ల ఎన్నికలు కాదు.. నోట్ల ఎన్నికలు'

Congress leader Jairam Ramesh alleged that currency elections were held in Munugode. తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గంలో మద్యం, మనీతోనే ఎన్నికలు జరిగాయని కాంగ్రెస్‌ అగ్రనేత జైరాం రమేష్‌

By అంజి  Published on  7 Nov 2022 9:21 AM GMT
మునుగోడులో జరిగింది.. ఓట్ల ఎన్నికలు కాదు.. నోట్ల ఎన్నికలు

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గంలో మద్యం, మనీతోనే ఎన్నికలు జరిగాయని కాంగ్రెస్‌ అగ్రనేత జైరాం రమేష్‌ ఆరోపించారు. ఇద్దరు కోటీశ్వరుల మధ్య కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గట్టి పోరాటం చేశారన్నారు. మునుగోడులో మద్యం ఏరులై పారిందన్నారు. మద్యం, డబ్బులు పంచడానికే నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులను దించారని అన్నారు. మునుగోడులో జరిగింది.. ఓట్ల ఎన్నికలు కాదని నోట్ల ఎన్నికల విమర్శించారు. మునుగోడులో ప్రజాస్వామ్యం హత్యకు గురైందన్నారు. అక్రమాలకు పాల్పడి విజయం సాధించారని జైరాం రమేష్‌ ఆరోపించారు.

కోట్లకు పడిగలెత్తిన వారితో ఓ సామాన్య నాయకురాలు పోరాడాల్సి వచ్చిందన్నారు. స్రవంతి బాగా కష్టపడ్డారని, ప్రత్యర్థి అభ్యర్థులపై పోరాడారని చెప్పారు. మునుగోడులో ఓటిమితో నిరాశ చెందడం లేదని, తామ పార్టీ పోరాటం కొనసాగుతుందని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్‌ పార్టీనే అని జైరాం రమేష్‌ అన్నారు. మునుగోడులో కాంగ్రెస్‌ ఓటమిని, ప్రజల తీర్పును అంగీకరిస్తామని చెప్పారు. బై పోల్‌లో ఎందుకు ఓడిపోయామనే దానిపై పార్టీలో సమీక్షించుకుంటామని చెప్పారు. సాధారణ ఎన్నికలైతే స్రవంతి మునుగోడులో గెలిచేవారన్నారు.

తమకు తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌తో పాటు ఎంఐఎం పార్టీ ప్రత్యర్థేనని జైరాం రమేష్‌ చెప్పారు. రాష్ట్రంలో కాంట్రాక్టులు, కాంట్రాక్టర్ల చుట్టే ఎన్నికలు తిరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవని, ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేశామని, ఆయన నుంచి వివరణ రాకపోతే చర్యలు ఉంటాయని చెప్పారు. మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'కు రాష్ట్రంలో మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చెప్పారు.

Next Story