హైదరాబాద్: వినికిడి లోపం కారణంగా బాధ పడుతున్న నాలుగేళ్ల నేతావత్ లిఖితా శ్రీకి తక్షణం ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నలుగురు పిల్లలతో కలిసి ఆడుతూపాడుతూ గడపాల్సిన ఆ పాపకు వినికిడి లోపం శాపంగా మారింది. ఎవరు ఏం చెబుతున్నారో కూడా అర్థం కాక అమాయకంగా అలాగే ఉండిపోతోంది.
ఆ పాపలో వినికిడి లోపాన్ని గుర్తించిన తర్వాత తల్లిదండ్రులు చికిత్స కోసం ఎంతో మంది వైద్యులను సంప్రదించారు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ తప్పని సరి అని చెప్పడంతో అందుకు అవసరమయ్యే ఖర్చును భరించే స్తోమత ఆ కుటుంబానికి లేదు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి రాగానే వారు మానవత్వంతో స్పందించారు. వెంటనే ఆ పాపకు అవసరమైన పూర్తి వైద్యం ఉచితంగా అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చికిత్స జరిగి లిఖిత పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.