హైదరాబాద్: బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతులు జారీ చేసే విషయంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, ఇతర అనుమతుల విషయంలో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా అలసత్వం చూపుతున్నారని మండిపడ్డారు.
డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో హెచ్ఎండీఏ పరిధిలో బిల్డ్ నౌ కింద పనుల అనుమతుల అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. అనుమతుల జాప్యంలో ఆలస్యానికి కారకులను గుర్తించి వారిని సరెండర్ చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ముఖ్యంగా నీటి పారుదల శాఖ విభాగం అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, నాలాల, ఇతర నీటి వనరులకు సంబంధించి లైడార్ సర్వేను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. సమగ్రమైన వివరాలున్నప్పుడు మాత్రమే ఎటువంటి వివాదాలకు తావుండదని అన్నారు. ఈ విషయంలో GHMC, హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ త్వరగా అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో హెచ్ఎండీఏ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.