నేడు స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

CM KCR will participate in the closing ceremony of India's Independence Diamond Festival. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు సోమవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా ముగియనున్నాయి.

By అంజి  Published on  22 Aug 2022 3:32 AM GMT
నేడు స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు సోమవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశానికి గుర్తింపు తెచ్చిన పలువురు క్రీడాకారులు, ఇతర ప్రముఖులను సీఎం కేసీఆర్‌ సన్మానించనున్నారు. మూడు గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అనేక మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులచే అద్భుతమైన ప్రదర్శనలు ఉంటాయి.

సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత కచేరీ, డ్రమ్మర్ శివమణి ప్రదర్శన, పద్మజా రెడ్డి బృందంచే నృత్య ప్రదర్శన, వార్సి సోదరులచే ఖవ్వాలి, స్థానిక కళాకారులచే లేజర్ షో, బాణసంచా ప్రదర్శనలు ఈవెంట్‌లో హైలైట్‌గా నిలవనున్నాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్‌పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు సహా దాదాపు 30 వేల మంది హాజరవుతారని అంచనా. ప్రజాప్రతినిధుల రాకపోకలకు జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే 'స్వతంత్ర భారత వజ్రోత్సవాలు' వైభవోత్సవ కార్యక్రమం దృష్ట్యా ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్‌బీ స్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. కావున వాహ‌న‌దారులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవాల‌ని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

భారత స్వాతంత్ర్య దినోత్సవం యొక్క వజ్రోత్సవ వేడుకలు ఆగస్టు 8న ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించడం నుండి విద్యార్థులకు పోటీలు, నిరుపేదలకు పండ్లు పంపిణీ చేయడం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటడం వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగాయి. ఆగస్టు 16న రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది. అబిడ్స్ జంక్షన్‌లో సామూహిక జాతీయ గీతాలాపనలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ప్రతి ఇంటిపై తెలంగాణ నేత కార్మికుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేసిన జాతీయ జెండాలను ఎగురవేశారు. మహాత్మా గాంధీ సందేశాన్ని రాబోయే తరాలకు వ్యాప్తి చేయడానికి దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల కోసం.. రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో 'గాంధీ' చిత్రాన్ని ప్రదర్శించారు.

Next Story