యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
CM KCR visits Yadadri Laxmi Narasimha Swamy Temple.ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని
By తోట వంశీ కుమార్ Published on 19 Oct 2021 10:01 AM GMT
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్నిమంగళవారం దర్శించుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నాం యాదాద్రికి చేరుకున్న సీఎం ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం కాన్వాయ్లో ఘాట్రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్తో పాటు పలువురు నాయకులను వేద పండితులు ఆశీర్వదించారు.
ఆలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం ఆలయ పునఃప్రారంభ తేదీ, ముహూర్తాలను సీఎం వెల్లడించనున్నారు. మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం ప్రకటించనున్నారు. ఇప్పటికే చినజీయర్ స్వామి ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని నిర్ణయించారని, యాదాద్రిలోనే సీఎం స్వయంగా ప్రకటిస్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు తదితరులున్నారు