తెలంగాణ‌లో 60వేల‌కు పైగానే ఉద్యోగ ఖాళీలు..!

CM KCR to chair cabinet meeting on today.సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఆదివారం మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2021 2:52 AM GMT
తెలంగాణ‌లో 60వేల‌కు పైగానే ఉద్యోగ ఖాళీలు..!

సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఆదివారం మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో మంత్రిమండ‌లి స‌మావేశం కానుంది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కం విధివిధానాల‌ను మంత్రి మండ‌లి ఖ‌రారు చేయ‌నుంది. హుజురాబాద్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయ‌డానికి అనుమ‌తిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసే అవ‌కాశం ఉంది. కొత్త రేష‌న్ కార్డులు, కొత్త ఫించ‌న్‌దారుల‌కు అవ‌స‌ర‌మైన మొత్తాల విడుద‌ల పై ఆదేశాలు జారీ చేయ‌నుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వ్యవసాయం, ఇరిగేషన్‌పైనా సమావేశంలో చర్చించనున్నారు. ఇక కరోనా మూడో వేవ్‌ వస్తుందన్న నేపథ్యంలో ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనుంది

ఇటు తెలంగాణలో ప్ర‌భుత్వ ఉద్యోగ ఖాళీలు 60వేల‌కు పైగా ఉన్న‌ట్లు గుర్తించిన వివిధ శాఖ‌లు ప్ర‌భుత్వానికి నివేదించ‌గా.. ఆ వివ‌రాలు మంత్రి మండ‌లి స‌మావేశంలో స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు తెలిసింది. కొత్త జోన‌ల్ విధానానికి అనుగునంగా పోస్టులు, ఖాళీల‌తో గుర్తించి ఇచ్చిన వివ‌రాల‌ను సీఎం, మంత్రులు ప‌రిశీలించి ఆమోదం తెలిపాక ఉద్యోగ నోటిఫికేష‌న్ల జారీకి మార్గం సుగ‌మ‌మౌతుంది. ఆగ‌స్టు 15 నాటికి ఏదైన ఒక నోటిఫికేష‌న్ వెలువ‌రించాల‌ని ప్ర‌భుత్వం బావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కృష్ణా, గోదావ‌రి న‌ది యాజ‌మాన్య బోర్డుల ప‌రిధిని ఖరారు చేస్తూ కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేష‌న్‌పై మంత్రి మండ‌లి భేటిలో విస్తృతంగా చ‌ర్చించి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. పోడు భూముల అంశంపై పైనా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో రాజకీయ అంశాల‌పైనా స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది.

Next Story