భారీగా పెన్షన్ పెంచేసిన సీఎం కేసీఆర్

CM KCR announces welfare bonanza for differently abled. తెలంగాణలో సీఎం కేసీఆర్ వికలాంగుల పెన్షన్ రూ.4,116కి పెంచుతున్నట్లు ప్రకటించారు.

By Medi Samrat  Published on  10 Jun 2023 1:42 AM GMT
భారీగా పెన్షన్ పెంచేసిన సీఎం కేసీఆర్

తెలంగాణలో సీఎం కేసీఆర్ వికలాంగుల పెన్షన్ రూ.4,116కి పెంచుతున్నట్లు ప్రకటించారు. సీఎం నిర్ణయం వల్ల 5,16,890 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. మంచిర్యాలలో జరిగిన బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసిందన్నారు. మంచిర్యాల జిల్లా కోసం గతంలో ఎన్నో పోరాటాలు జరిగాయని, సింగరేణిది 134 ఏళ్ల చరిత్ర, మన సొంత ఆస్తి అని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేసుకున్నామన్నారు. రైతు బంధు ద్వారా రూ.65 వేల కోట్లను రైతులకు అందించామని కేసీఆర్ తెలిపారు. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటేశామని, 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫాంను పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేసీఆర్ అన్నారు. వచ్చే దసరా కానుకగా సింగరేణి కార్మికులకు రూ.700 కోట్లు బోనస్ ఇవ్వబోతున్నామని సీఎం వరాలజల్లు కురిపించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందున్నామని కేసీఆర్ అన్నారు. దేశంలో బొగ్గుకు కొరత లేదని, 360 బిలియన్ టన్నుల బొగ్గు వుండగా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం చేస్తామని అంటున్నారని సీఎం విమర్శించారు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేస్తున్నారని, సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే.. బీజేపీ పూర్తిగా ముంచుతోందన్నారు. ధరణి వుంటేనే రైతులు ఖాతాలో రైతు బంధు పడుతుందని కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కూడా మీ భూమిని మార్చలేడని కేసీఆర్ అన్నారు. ధరణితో రైతుకే అధికారం ఇచ్చామని, ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి వచ్చాక పల్లెలన్నీ ప్రశాంతంగా వుంటున్నాయని సీఎం అన్నారు.


Next Story