గోదావరి పుష్కరాల శాశ్వత ప్రాతిపదిక ఏర్పాట్లపై సీఎం కీలక ఆదేశాలు
గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు
By - Knakam Karthik |
హైదరాబాద్: రాష్ట్రంలో గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్న ఆయన..బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలన్నారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
జాతీయ రహదారులు, రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్ ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పుష్కరాల సమయంలో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి ఘాట్స్ వద్ద స్నానమాచరించేందుకు వీలుగా ఉండేలా అభివృద్ధి చేయాలన్న సీఎం ..ప్రతీ ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరరుగా ఘాట్స్ డిజైన్లు రూపొందించాలన్నారు. పర్యాటక శాఖ , నీటిపారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించిన సీఎం రేవంత్ సూచించారు.