Telangana: ప్రభుత్వ విద్యార్థులకు తీపికబురు.. ఇకపై మధ్యాహ్న భోజనంలో 'స్టీమ్ రైస్'
తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు పౌరసరఫరాల శాఖ తీపి కబురు అందించింది.
By - అంజి |
Telangana: ప్రభుత్వ విద్యార్థులకు తీపికబురు.. ఇకపై మధ్యాహ్న భోజనంలో 'స్టీమ్ రైస్'
తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు పౌరసరఫరాల శాఖ తీపి కబురు అందించింది. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో ఇకపై నాణ్యమైన 'స్టీమ్ రైస్' పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మార్పు వల్ల విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత పెరగడమే కాకుండా, వారి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరనుంది. తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు ఇప్పటివరకు సరఫరా చేస్తున్న సాధారణ బియ్యం స్థానంలో ఇకపై స్టీమ్ రైస్ను అందించనున్నారు.
ఏమిటీ స్టీమ్ రైస్? దీని ప్రత్యేకతలేంటి?
సాధారణంగా బియ్యాన్ని మిల్లింగ్ చేసే ప్రక్రియలో కొన్ని మార్పులు చేయడం ద్వారా స్టీమ్ రైస్ను తయారు చేస్తారు. వడ్లను మిల్లులో ఆడించడానికంటే ముందే అధిక పీడనం గల ఆవిరితో ప్రాసెస్ చేస్తారు. దీనివల్ల బియ్యం గింజ గట్టిపడుతుంది. సాధారణ బియ్యం మిల్లింగ్ సమయంలో నూకలుగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ స్టీమ్ రైస్ గింజలు అస్సలు విరగవు, అన్నం వండినప్పుడు గింజ పొడవుగా ఉంటుంది. స్టీమ్ రైస్తో వండిన అన్నం ముద్దకాకుండా, పొడిపొడిగా, రుచిగా ఉంటుంది. ఇది విద్యార్థులకు తినడానికి ఎంతో అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలో బియ్యం పొట్టులోని పోషకాలు గింజ లోపలికి వెళ్తాయి, తద్వారా అన్నం తిన్నప్పుడు విద్యార్థులకు మెరుగైన శక్తి లభిస్తుంది.
రాష్ట్రంలోని సుమారు 35 లక్షల మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వ విద్యార్థులకు సన్నబియ్యంతో సమానమైన నాణ్యమైన భోజనాన్ని అందించడం మరియు అన్నం వృథా కాకుండా చూడటం. గతంలో కొన్నిచోట్ల సాధారణ బియ్యం ముద్దగా అవుతున్నాయని, నాణ్యత తక్కువగా ఉంటుందని ఫిర్యాదులు వచ్చేవి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, 'డైనింగ్ హాల్'లో విద్యార్థులు ఇష్టంగా భోజనం చేసేలా చూడాలన్నదే పౌరసరఫరాల శాఖ ప్రధాన ఉద్దేశ్యం. ఏప్రిల్ నుంచి లేదా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఈ సరఫరా పూర్తిస్థాయిలో జరిగే అవకాశం ఉంది.