గవర్నర్ తమిళిసై విమర్శలకు మాజీమంత్రి హరీశ్‌రావు కౌంటర్

గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  26 Jan 2024 6:27 AM GMT
brs, harish rao,  telangana governor ,

గవర్నర్ తమిళిసై విమర్శలకు మాజీమంత్రి హరీశ్‌రావు కౌంటర్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నియంతృత్వ ధోరణితో గత ప్రభుత్వం వ్యవహరించిందనీ.. అందుకే రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో సరైన తీర్పును ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు స్పందించారు. గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

ఎక్స్ వేదికగా స్పందించిన హరీశ్‌రావు ఓ పోస్టు పెట్టారు. కాంగ్రెస్‌, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందని అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియాకమంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బయటపడిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరించారని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి గవర్నర్ నిరాకరించారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారంటూ హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

ఇది ద్వంద్వ నీతి కాదా అంటూ గవర్నర్‌ను హరీశ్‌రావు నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం కదా అని ప్రశ్నించారు. గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్య సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారికి బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిందని అన్నారు. అప్పుడు కూడా రాజకీయ కారణాలతో గవర్నర్‌ వాటిని ఆమోదించలేదన్నారు. మరి ఇప్పుడెందుకు ఆమోదించారంటూ ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కటయ్యాయంటూ ఆరోపించారు. బీఆర్ఎస్‌ ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం దురదృష్టకరమని చెప్పారు. న్యాయసూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకేలా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు మద్య ఎందుకు తేడా చూపిస్తున్నారంటూ గవర్నర్‌ను మాజీమంత్రి హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.


Next Story