ఇది దేశ భవిష్యత్ ను మార్చే యాత్ర: రేవంత్ రెడ్డి
Bharat Jodo Yatra to enter Telangana on October 24.
By Medi Samrat Published on 1 Oct 2022 8:59 AM GMTభారత్ జోడో యాత్ర దేశ భవిష్యత్తును మార్చే యాత్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు గాంధీ చేపట్టిన దండియాత్రలా.. భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చరిత్రలో ఒక కీలకమైన భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ఒక గొప్ప అవకాశమని తెలిపారు. హైదరాబాద్ మణికొండలోని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ నివాసంలో మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందంతో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందం ఇక్కడకు వచ్చారు. కర్ణాటకలో 22రోజులు, ఏపీలో 4 రోజులు జోడో యాత్ర సాగనుందని ఆయన అన్నారు.
అక్టోబర్ 24న యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని, తెలంగాణలో యాత్ర ముగిసిన తరువాత మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. జోడో యాత్రపై ఒకరికొకరం సమన్వయం చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర నేతలతో కలిసి సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపామన్నారు. కర్ణాటకలో కూడా మహారాష్ట్ర, తెలంగాణ నేతలు పర్యటించాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మహారాష్ట్ర సీల్పీ నేత బాల సాహబ్ తోరాట్, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ సెక్రెటరీలు సోనాల్ పటేల్, ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.