తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావుపై భజరంగ్ దళ్ నిరసన

Bajrang Dal protest against Telangana Health Director Srinivas Rao. తెలంగాణలోని కొత్తగూడం భదాద్రి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏసుక్రీస్తు ఆశీస్సులు, అతడి కరుణ

By అంజి  Published on  22 Dec 2022 1:14 PM GMT
తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావుపై భజరంగ్ దళ్ నిరసన

తెలంగాణలోని కొత్తగూడం భదాద్రి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏసుక్రీస్తు ఆశీస్సులు, అతడి కరుణ వల్లే కోవిడ్ మహమ్మారి తగ్గిందని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్ జి శ్రీనివాసరావు చేసిన ప్రకటనను భజరంగ్ దళ్ ఖండించింది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. జీసస్‌ వల్లనే కోవిడ్‌-19 తగ్గుముఖం పట్టిందని, క్రైస్తవం వల్లనే భారతదేశం అభివృద్ధి చెందిందని, క్రైస్తవం వల్లే భారతీయులు బతికారని అన్నారు. వైద్యులు అందించిన వైద్యం వల్ల పరిస్థితి అదుపులోకి రాలేదని, యేసు దయ వల్లనే అని ఆయన అన్నారు. భారతదేశ అభివృద్ధికి క్రైస్తవులే కారణం అన్నారు. క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బజరంగ్ దళ్ హైదరాబాద్ యూనిట్ కన్వీనర్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు, క్రైస్తవ మతాల వల్ల కోవిడ్ మహమ్మారి అంతమైతే.. శ్రీనివాసరావు, ఆరోగ్య శాఖ అవసరం ఏమిటని ప్రశ్నించారు. అతను క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడానికి తన స్థానాన్ని ఉపయోగిస్తున్నాడని మండిపడ్డారు. ''ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్న ఆయన ఇతర మతాలను దెబ్బతీసేలా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఆయనను తక్షణమే బర్తరఫ్ చేయాలని తెలంగాణ సీఎంను డిమాండ్ చేస్తున్నాం, లేనిపక్షంలో తెలంగాణలోని 9 వేల గ్రామాల్లో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం'' అని హెచ్చరించారు.

కోటి సుల్తాన్ బజార్‌లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ కార్యాలయంలోకి భజరంగ్ దళ్ సభ్యులు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అందరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి అనంతరం విడుదల చేశారు.

మతాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్‌రావును వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. శ్రీనివాసరావు మత ప్రాతిపదికన సిబ్బందిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉంటే.. హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అలాంటి ప్రకటనలు చేయడాన్ని ఖండించారు, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.

గత నెలలో ప్రగతి భవన్‌లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాదాలను మొక్కినందుకు శ్రీనివాసరావు వైద్య వర్గాలతో పాటు వివిధ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. చంద్రశేఖర్ రావు తనకు తండ్రి లాంటి వారంటూ విమర్శల మధ్య తన ప్రవర్తనను సమర్థించుకున్నారు.

Next Story