Telangana: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.

By Srikanth Gundamalla  Published on  16 Dec 2023 6:25 AM GMT
bad news,  addicts, telangana govt,

 Telangana: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ మొదలుకొని.. సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌పై తీసుకున్న నిర్ణయం వరకు ఇలా ప్రతీది జనాలను ఉద్దేశించే తీసుకుంటోంది. అయితే.. తెలంగాణ వ్యాప్తంగా వైన్స్‌ల సంగతి పక్కకు పెడితే.. బెల్ట్‌ షాపులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కోట్లలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. పల్లెల్లో అయితే ఎప్పుడంటే అప్పడే ఈ బెల్ట్‌షాపుల ద్వారా మద్యం దొరుకుంతుండటతో యువత మద్యానికి బానిస అవుతున్నారనే వాదన ఉంది. వాటిని మూసివేయాలంటూ మహిళల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం బెల్ట్‌ షాపుల నిర్వహణకు కళ్లెం వేసే చర్యలకు ముందడుగు వేస్తుందని తెలుస్తోంది.

గ్రామాల్లో బెల్ట్‌ షాపుల పేరిట మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వైన్స్‌ షాపులకు టైమింగ్స్‌ ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు మూసివేస్తారు. కానీ.. ఆ తర్వాత కూడా బెల్ట్‌ షాపుల్లో మద్యం లభిస్తుంది. ఈ క్రమంలో యువత, మరికొందరు మద్యంబాబులు మద్యం విచ్చలవిడిగా దొరకడంతో దానికి బానిసలవుతున్నారు. మరోవైపు ఇళ్లలో సమస్యలు కూడా వస్తున్నాయి. మహిళలు కూడా బెల్ట్‌ షాపులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్థికంగా సంపాదించిన వాటిలో ఎక్కువశాతం తాగడానికే తగేలస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం బెల్ట్‌ షాపులను పూర్తిగా తీసేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌ అధికారులు కూడా ఇలాంటి బెల్ట్‌ షాపులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే.. బెల్ట్‌షాపుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజల డిమాండ్ మేరకే తెలంగాణ ప్రభుత్వం బెల్ట్‌షాపులను తీసేసే యోచన చేస్తోందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడనుందని చెబుతున్నారు.

Next Story