ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

బీజేపీకి రాజీనామా చేసిన సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ఎట్టకేలకు ప్రజాశాంతి పార్టీలో చేరారు.

By Srikanth Gundamalla  Published on  4 March 2024 10:45 AM GMT
babu mohan,   prajashanti party, politics, telangana ,

 ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటికీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపు కోసం ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన మాజీమంత్రి బాబు మోహన్ ఓటమిపాలయ్యారు. ఆందోల్‌ సీటు కేటాయింపులో పార్టీ నేతలతో తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తగా ఆ ఎన్నికల్లో బాబు మోహన్ ఓడిపోయారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ గెలపొందారు. బాబూ మోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల బీజేపీ, ఆ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత వెంటనే బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు.

ఏ పార్టీలో చేరతానేది బాబు మోహన్ వెంటనే చెప్పలేదు. కొన్నాళ్ల పాటు సైలెంట్‌గానే ఉన్న ఆయన ఎట్టకేలకు ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్‌ నేతృత్వంలో ఉన్న పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రజాశాంతి పార్టీలో చేరడంతో ఆయన ఏదో ఒక సీటు నుంచి కచ్చితంగా పోటీ చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో వరంగల్ స్థానం నుంచి బరిలోకి దిగనున్నటన్లు తెలుస్తోంది.

గతంలో వరంగల్‌ లోక్‌సభ స్థానం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. జీవితంలో ఒకకసారైఆ వరంగల్ నుంచి కచ్చితంగా లోక్‌సభకు పోటీ చేస్తానని అన్నారు. ఎంపీగా విజయం సాధించాలని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజాశాంతి పార్టీలో చేరడంతో ఆయన కామెంట్స్‌కు బలం చేకూరుస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికల్లో బాబు మోహన్ టికెట్ ఆశించారనీ.. పార్టీ నిరాకరించడంతోనే బీజేపీకి రాజీనామా చేశారనే వార్తలు ఉన్నాయి.

Next Story