ములుగు జిల్లాలో అద్భుతం: బయటపడ్డ 100 ఎకరాల భారీ 'రాకాసి బండల' నగరం!
ములుగు జిల్లాలోని గోదావరి లోయ ప్రాంతంలో ప్రాచీన మానవ నాగరికతకు సంబంధించిన అరుదైన ఆనవాళ్లను తెలంగాణ హెరిటేజ్ శాఖ సాంకేతిక బృందం కనుగొంది.
By - అంజి |
ములుగు జిల్లాలో అద్భుతం: బయటపడ్డ 100 ఎకరాల భారీ 'రాకాసి బండల' నగరం!
ములుగు జిల్లాలోని గోదావరి లోయ ప్రాంతంలో ప్రాచీన మానవ నాగరికతకు సంబంధించిన అరుదైన ఆనవాళ్లను తెలంగాణ హెరిటేజ్ శాఖ సాంకేతిక బృందం కనుగొంది. తాడ్వాయి మండలం మోట్లగూడెం గ్రామ సమీపంలో విస్తారంగా విస్తరించి ఉన్న ప్రాచీన సమాధుల సమూహాన్ని పరిశోధకులు గుర్తించారు. స్థానికంగా 'రాకాసి బండలు' లేదా 'రాకాసి గుహలు'గా పిలిచే ఈ నిర్మాణాలు, ఆదిమ మానవుల సామాజిక జీవనం మరియు ఆచార వ్యవహారాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
పురాతన 'టౌన్షిప్' ఆనవాళ్లు:
హెరిటేజ్ శాఖ డైరెక్టర్ ఆచార్య అర్జున్ రావు నేతృత్వంలోని బృందం కప్పలాయి గుట్టపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. ఇక్కడ సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ సమాధులు 'డోల్మెన్' (Dolmen) రకానికి చెందినవని వారు నిర్ధారించారు. ఇసుక రాళ్లతో నిర్మించిన ఈ సమాధులపై 10 నుంచి 20 టన్నుల బరువున్న భారీ రాళ్లను మూతల్లా (Capstone) ఉంచారు. ఒక్కో సమాధి చుట్టూ 10 అడుగుల వ్యాసార్థంతో రాతి గోడ ఉంది. ఇవి ఒకదానికొకటి నిర్ణీత దూరంలో అమర్చబడి ఉండటం చూస్తుంటే, ఇది ఒక వ్యవస్థీకృత పురాతన 'టౌన్షిప్' అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద డోల్మెన్ సమాధుల సమూహాలలో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
నిర్లక్ష్యం నీడలో చారిత్రక సంపద:
ఈ మెగాలిథిక్ నిర్మాణాలు మన పూర్వీకుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకలు. ఈజిప్టు పిరమిడ్లతో పోల్చదగ్గ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. స్థానికులు ఇళ్ల నిర్మాణం కోసం ఇక్కడి రాళ్లను తరలిస్తుండటం, ప్రాచీన రాతి తొట్టిలను పశువుల నీళ్ల కుండీలుగా వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు పవిత్ర స్మారక చిహ్నాలుగా వెలిగిన ఈ ప్రాంతాలు ఇప్పుడు దట్టమైన అడవిగా మారి, క్రూర మృగాలకు నివాసాలుగా మారుతున్నాయని హెరిటేజ్ బృందం నివేదించింది.
పురాతన నమ్మకాలు:
ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని దామరవాయి, జగ్గారం, మల్లూరు గుట్ట వంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఆనవాళ్లు లభించాయి. మరణానంతరం కూడా జీవితం ఉంటుందనే ఆదిమ మానవుల నమ్మకానికి ఈ సమాధులు నిదర్శనం. దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కనిపించే మెగాలిథిక్ సంస్కృతితో ఇవి పోలిక కలిగి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ అపురూప చారిత్రక సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.