సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సదరు ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వేగంగా ఉన్న బస్సు ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అటు విశాఖపట్నంలోని గాజువాక ఆటోనగర్లో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రధాన రహదారిపై బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్, అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపివేశారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరినీ వెంటనే కిందకు దింపేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.