Telangana: గొంతులో దోశ ఇరుక్కొని వ్యక్తి మృతి
దోశ తింటుండగా ఒక్కసారిగా అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
By అంజి Published on 24 Oct 2024 6:49 AM IST
Telangana: గొంతులో దోశ ఇరుక్కొని వ్యక్తి మృతి
దోశ తింటుండగా ఒక్కసారిగా అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బుధవారం నాడు చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని సుభాష్నగర్లో నివాసం ఉంటున్న వెంకటయ్య (43) ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 11 గంటల సమయంలో హోటల్ నుంచి దోశ తీసుకుని ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యుల ముందే దోశను తినడం మొదలు పెట్టాడు. దోశ గొంతులో ఇరుక్కోవడంతో నీళ్లు తాగుతుండగానే పక్కకు ఒరిగిపోయాడు.
కళ్లెదుటే వెంకటయ్య ప్రాణాలు పోవడంతో కుటుంబ సభ్యల రోదనలు మిన్నంటాయి. వెంకటయ్యకు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. గతంలో కేరళలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకున్నది. వలయార్లో ఇడ్లీలు తినే పోటీల్లో పాల్గొన్న 50 ఏళ్ల వ్యక్తి.. పోటీలో భాగంగా ఇడ్లీలు తింటున్న సమయంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు అతన్ని ప్రాణాలు కాపాడేందుకు గొంతులో నుంచి ఇడ్లీలను బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.