మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో సహా నలుగురిపై కేసు నమోదు

ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, బెదిరింపుల కేసు నమోదైంది.

By అంజి  Published on  27 Dec 2023 1:30 AM GMT
Ibrahimpatnam, Manchireddy Kishan Reddy, Amoy Kumar, Municipal Chairperson

మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో సహా నలుగురిపై కేసు నమోదు

ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, బెదిరింపుల కేసు నమోదైంది. కిషన్​రెడ్డితో పాటు ఆయన కుమారుడు సహా పలువురు ప్రభుత్వ ఉద్యోగస్తులపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. కిషన్​రెడ్డితో పాటు ఆయన కుమారుడు ప్రశాంత్​ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్‌ కుమార్, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసుఫ్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

2019 ఎన్నికల సమయంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పోస్టు కోసం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి రూ.2.5 కోట్లు తీసుకున్నారని కప్పరి స్రవంతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి నెల 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎమ్మెల్యే కొడుకు ప్రశాంత్ డిమాండ్ చేశారని ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్​గా ఎంపికైన దగ్గరి నుంచి కులం పేరుతో మాజీ ఎమ్మెల్యే కిషన్​రెడ్డి, ఆయన కుమారుడు వేధిస్తున్నారని స్రవంతి ఫిర్యాదులో వివరించారు. మంచిరెడ్డి కిషన్​రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్​ కమిషనర్ యూసఫ్.. అప్పటి వైస్​ ఛైర్మన్​కు బాధ్యతలు అప్పగించేందుకు తనను నిత్యం సెలవు పెట్టాలని బెదిరించారని స్రవంతి తెలిపారు.

మాజీ కలెక్టర్​ ఆమోయ్‌ కుమార్ సైతం తనను పిలిచి అప్పర్ క్యాస్ట్ తో గొడవపడలేరు.. లీవ్ లో వెళ్ళాలని బెదిరించారని స్రవంతి ఆరోపించారు. సెలవు పెట్టకపోతే తనను సస్పెండ్​ చేస్తానని రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ బెదిరించారని ఆమె తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ స్రవంతి ఫిర్యాదు మేరకు మంచిరెడ్డి కిషన్​రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్‌ కుమార్, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసఫ్​పై ఎస్సీ ఎస్టీ 504, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మున్సిపల్​ ఛైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి బీఆర్​ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్​లో చేరారు.

Next Story