తెలంగాణ పోలీసుల కొత్త ప్రయోగం..
By Newsmeter.Network Published on 29 March 2020 9:26 AM GMTప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంది. ఈ వైరస్ భారిన పడి వేలాది మంది మృత్యువాత పడుతుండగా.. లక్షలాది మంది వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ భారత్లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అటు తెలంగాణలోనూ వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్కు పిలుపునిచ్చాయి. లాక్డౌన్కు పిలుపునిచ్చి వారం అవుతున్నా.. ఇంకా పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. అత్యవసరం లేకపోయినా వాహనాలపై చక్కర్లు కొడుతున్నారు. పాత మెడికల్ చీటీలు పట్టుకొని రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు లాఠీ చార్జి చేసినా అది వైరల్గా మారి పోలీసులకు చెడ్డపేరు తెస్తుంది. ఫలితంగా లాక్డౌన్ కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read :లాక్ డౌన్ కఠిన నిర్ణయమే.. అది మీ రక్షణ కోసమే
అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి గుణపాఠం చెప్పేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎలాంటి అత్యవసరం లేకపోయినా రోడ్లమీదకు వచ్చే వాహనాలపై దృష్టిసారించింది. గల్లిdలో ఉండే వాహనాల నెంబర్లను పోలీసులు రిజిస్టర్ చేస్తున్నారు. ఆ వాహనం రోడ్డు ఎక్కి మూడు కి.మీ దాటి ప్రయాణం చేస్తే ఆ వాహనాన్ని సీజ్ చేసే ప్రక్రియకు పోలీసులు తెరలేపారు. బయటకు వచ్చే వాహనాలను ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో తొలుత మూడు కమిషనరేట్ల పరిధిలో అప్ డేట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మూడు కి.మీ దాటి ప్రయాణించే వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఈ విధానంతోనైనా లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చే వారి ఆటలకు చెక్పెట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరి పోలీసులు తీసుకుంటున్న ఈ చర్య ఎంత మేరకు ఫలితానిస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read :దేశంలో 25కు చేరిన కరోనా మృతుల సంఖ్య