ఈఎస్ఐ స్కామ్.. వెలుగులోకి మరో రూ.100 కోట్ల అవినీతి
By Newsmeter.Network Published on 31 Dec 2019 11:46 AM GMTముఖ్యాంశాలు
- ఈఎస్ఐ స్కామ్లో ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు
- తవ్విన కొద్ది వెలుగులోకి వస్తున్న దేవికారాణి అవినీతి
- ఏసీబీ అదుపులో ఓమ్ని కంపెనీ చైర్మన్ శ్రీహరిబాబు
హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్ కేసులో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ వ్యవహారం బట్టబయలైంది. ఓమ్ని చైర్మన్ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ షెల్ కంపెనీల పేరుతో ప్రభుత్వానికి రూ.110 కోట్లు టోకరా పెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. లెజెండ్ పేరుతో షెల్ కంపెనీ ఏర్పాటు చేసి తెల్ల రక్తకణాలు కిట్స్, గ్లూకోజ్ క్యూయేట్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిపినట్టు తెలుస్తోంది. శ్రీహరిబాబును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు కృపాసాగర్, వెంకటేశ్వర్రెడ్డి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు.
ఈఎస్ఐ స్కామ్ కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. కేసు విచారణలో భాగంగా ఓమిని మెంట్ ఎండీ బాబ్జీ ఇంటిపై, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కాగా బాబ్జీ ఇంట్లో రూ.99 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. బేగంపేటలోని బాబ్జీ నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా సంపాదించిన రూ.33 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈఎస్ఐ స్కామ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న డైరెక్టర్ దేవికారాణితో కలిసి బాబ్జీ అక్రమ బిడ్లు వేశాడని ఆరోపణలు ఉన్నాయి. రూ.100 కోట్ల మందులను బాబ్జీ కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.