రేపటి నుంచే 'ధరణి'

By సుభాష్  Published on  28 Oct 2020 3:20 AM GMT
రేపటి నుంచే ధరణి

తెలంగాణలో 'ధరణి' పోర్టల్‌ గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ముందుగా సదరా పండగ సందర్బంగా 25న ప్రారంభించాలని భావించినా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడి, 29న ప్రారంభించేందుకు నిర్ణయించారు. రేపటి నుంచే తహసీల్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి సాగుభూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్న కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా 570 మండలాల్లో దీనికి శ్రీకారం చుట్టనుంది.

కాగా, ఇటీవల రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకువచ్చి కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్‌.. వీఆర్వో వ్యవస్థను సైతం రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ధరణిపోర్టల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర భూ లావాదేవీలకు ప్రామాణికంగా, ఆధారంగా వేదికగా మార్చడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ధరణిని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే పోర్టల్‌ ప్రారంభం అయ్యేలోపు సంబంధిత ఉద్యోగుల నియామకం చేపట్టమని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్‌. ధరణి పోర్టల్‌లో భూమి రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ తదితర కీలక అంశాలను అప్‌డేట్‌ చేస్తారు. ధరణి ప్రారంభమయ్యేంత వరకు రిజిస్ట్రేషన్లను ఆపాలని అప్పట్లో సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు.

Next Story