తెలంగాణ కేబినెట్ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 6:48 AM GMT
తెలంగాణ కేబినెట్ భేటీలో కీల‌క నిర్ణ‌యాలు

ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. దాదాపుగా 7 గంట‌ల‌కు పైగా కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు, ప్ర‌భుత్వానికి ఎప్ప‌టిక‌ప్పుడు త‌గు సూచ‌న‌లు చేసేందుకు, ఆయా శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించేందుకు శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ఎనిమిది మంత్రి వ‌ర్గ ఉప సంఘాల‌ను నియ‌మించాల‌ని కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల సేక‌ర‌ణ విధానం, పౌల్ట్రీ పాల‌సీ రూపొందించాల‌ని కేబినెట్ నిర్ణయించింది. ఈ స‌మావేశంలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల‌ను ప‌రిశీలించి, ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌డం కోసం సీనియ‌ర్ ఐఎఎస్ అధికారుల‌తో క‌మిటీ వేయాల‌ని మంత్రి మండ‌లి నిర్ణ‌యించింది. దీనికి అనుగుణంగా ముగ్గురు ఐఎఎస్ అధికారుల‌తో ప్ర‌భుత్వం క‌మిటీని నియ‌మించింది. క‌మిటీలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ అధ్య‌క్ష‌త‌న ముఖ్య కార్య‌ద‌ర్శులు రామ‌కృష్ణ రావు, సునిల్ శ‌ర్మ స‌భ్యులు క‌మిటీని నియ‌మించింది. త్వ‌ర‌లో ఈ క‌మిటీ ఆర్టీసీ కార్మికుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి వారి డిమాండ్ల‌ను స‌మ‌గ్రంగా ప‌రిశీలించి, ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నుంది. కాగా క‌మిటీ నివేదిక‌ను అనుస‌రించి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. పేద ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీని కాపాడుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆర్టీసీ ఇప్ప‌టికే ఆర్థికంగా న‌ష్టాల్లో ఉన్నందున‌, స‌మ్మె యోచ‌న విర‌మించుకుని స‌హ‌క‌రించాల‌ని కార్మికులకు మంత్రి మండ‌లి విజ్ఞ‌ప్తి చేసింది. ప్రజలంతా పండుగలకు తమ సొంతూర్లకు పోయే సందర్భంలో సమ్మెకు పోయి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని కార్మికులను మంత్రి మండలి కోరింది.

తెలంగాణ ప్ర‌భుత్వం ఆయా అంశాల‌పై ఎనిమిది మంత్రి వ‌ర్గ ఉప సంఘాల‌ను ఏర్పాటు చేసింది. ఆయా శాఖ‌ల మంత్రుల‌ను చైర్మ‌న్లుగా క‌మిటీలు ఏర్పాటు చేశారు.

1. వైద్య, ఆరోగ్య కమిటీ

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన, మంత్రులు కెటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా వైద్య, ఆరోగ్య కమిటీ ఏర్పాటైంది. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వివిధ సీజన్లలో వచ్చే అంటువ్యాధుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

2.గ్రామీణ పారిశుధ్య కమిటీ

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ సభ్యులుగా ప్రభుత్వం గ్రామీణ పారిశుధ్య కమిటీని కేబినెట్ నియమించింది. ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలునూ, భవిష్యత్తులో గ్రామాల్లో పారిశుధ్య పనులను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అవసరమైన కార్యాచరణను అమలు చేసే విషయంలో ఈ కమిటీ అప్రమత్తంగా ఉంటుంది.

3. పట్టణ పారిశుధ్య కమిటీ

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రులు టి.హరీశ్ రావు, శ్రీనివాస గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా పట్టణ పారిశుధ్య కమిటిని ప్రభుత్వం నియమించింది. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అమలు చేసే కార్యాచరణను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

4. వనరుల సమీకరణ కమిటీ

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అధ్యక్షతన మంత్రులు కెటి రామారావు, శ్రీనివాస గౌడ్ సభ్యులుగా వనరుల సమీకరణ కమిటిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర స్థాయిలో వనరులను సమీకరించుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

5. పచ్చదనం కమిటీ

అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా పచ్చదనం కమిటీని ప్రభుత్వం నియమించింది. తెలంగాణలో పచ్చదనం పెంచడం, అడవులు కాపాడడం, కలప స్మగ్లింగును అరికట్టడం తదితర కార్యక్రమాలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది.

6. వ్యవసాయ కమిటీ

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యులుగా వ్యవసాయ కమిటి ఏర్పాటైంది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, కల్తీలను నిరోధించడం, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను అమలు చేయడం, విత్తనాలను, ఎరువులను సేకరించడానికి ఒక సమగ్ర విధానం రూపొందించడం తదితర కార్యక్రమాలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడం తదితర కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తుంది.

7. పౌల్ట్రీ కమిటీ

పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధ్యక్షతన మంత్రులు శ్రీనివాస గౌడ్, ఈటల రాజెందర్, నిరంజన్ రెడ్డి సభ్యులుగా పౌల్ట్రి కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో చాలా మంది ఆధార పడిన పౌల్ట్రి పరిశ్రమను పటిష్ట పరచడానికి అవసరమైన పౌల్ట్రి పాలసీ తీసుకురావడంతో పాటు, పౌల్ట్రీ అభివృద్ధికి తీసుకునే చర్యలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది. మంచి పౌల్ట్రీ పాలసీ ఉన్న రాష్ట్రాల్లో పర్యటించి ఈ కమిటీ అధ్యయనం కూడా చేస్తుంది.

8. సంక్షేమ కమిటీ

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ సభ్యులుగా సంక్షేమ కమిటిని ప్రభుత్వం నియమించింది. వివిధ వర్గాల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది.

రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ రంగ పరిస్థితిని మంత్రివర్గ సమావేశం విస్తృతంగా చర్చించింది. వర్షాకాలంలో పండిన అన్ని రకాల పంటలను ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయడానికి పౌర సరఫరాల సంస్థతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు సన్నద్ధం కావాలని మంత్రి మండలి కోరింది. వేసవి కాలం పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను ముందుగానే సమీకరించుకోవాలని సూచించింది. దీనికి అవసరమైన విధానం రూపొందించుకోవాలని చెప్పింది. అక్టోబ‌ర్ 10న మంత్రులు, కలెక్టర్ల సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ సమావేశానికి డిపిఓలను, డిఎల్పివోలు కూడా పాల్గొన‌నున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం కాపాడడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు, భవిష్యత్తులో చేయాల్సిన పనులపై ఈ సమావేశంలో చ‌ర్చించ‌నున్నారు.

Next Story