భారత సూపర్ ఫ్యాన్ ఇక లేరు..
By Newsmeter.Network Published on 16 Jan 2020 9:13 AM GMTటీమిండియా సూపర్ ఫ్యాన్ చారులతా పటేల్ గుర్తుందా..? 87 వయస్సులో ప్రపంచ కప్ మ్యాచుల్లో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. 2019 ప్రపంచ కప్ లో టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్తో ఆమె ఒక్క సారిగా సెలబ్రెటీగా మారిపోయారు. మ్యాచ్ జరుగుతున్నంతా
సేపూ జాతీయ జెండా ఊపుతూ, ఈలలు వేస్తూ భారత ఆటగాళ్లతో పాటు టీమిండియా అభిమానులను సైతం ఉత్సాహా పరిచారు. ఆ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఆమెతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె ఇకలేరనే వార్త క్రికెట్ అభిమానుల్లో విషాదం నింపింది.
జనవరి 13వ తేదీ ఉదయం గం. 5.30.నిలకు ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఎనిమిది పదుల వయసు దాటినా భారత క్రికెట్ అభిమానిగా ఆమె అందరిలో ప్రేరణ నింపడం అభినందనీయం. కాగా తాను భారత క్రికెట్ జట్టుకు దశాబ్ధాల నుంచి వీరాభిమానిగా కొనసాగుతున్నారు. 1983లో కపిల్ సేన ప్రపంచ కప్ను ముద్దాడిన సమయంలో తాను స్టేడియంలోనే ఉన్నానని విషయాన్ని చారులతా పటేల్ ఇది వరకే తెలపడం ఆమెకు క్రికెట్పై ఉన్న ప్రేమకు, ప్రధానంగా భారత జట్టుపై ఉన్న అభిమానానికి నిదర్శనం.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ‘ఈ విషయాన్ని శోకతప్త హృదయాలతో తెలియపరచాల్సి వస్తుంది. మా గ్రాండ్ మదర్ తుది శ్వాస విడిచారు. ఆమె చాలా మంచి మనిషే కాదు.. ఒక అసాధారణమైన వ్యక్తిత్వం కూడా ఆమె సొంతం. ఆమె మా ప్రపంచం’ అని చారులతా పటేల్ ఇన్స్టాగ్రామ్లో కుటుంబ సభ్యుల్లో ఒకరు పోస్ట్ చేశారు. చారులతా పటేల్ మృతిపై బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. చారులతా ఎప్పుడూ భారత జట్టుతోనే ఉంటారని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని పేర్కొంది.