వైసీపీలోకి 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు
By సుభాష్ Published on 26 Jan 2020 1:48 PM GMTఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 17 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అదే రకంగా ఉందని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రతినిధులను తీసుకునే అవసరం తమకు లేదని, కోట్లాది రూపాయలు పెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీన కొనాల్సిన అవసరం ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. డబ్బుతో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని జగన్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారని అన్నారు.
చంద్రబాబు అంతరించిపోతున్న నాయకుడు
ముఖ్యమంత్రి జగన్ నవతరం నాయకుడైతే చంద్రబాబు అంతరించిపోతున్న నాయకుడని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యనించారు. ఇక శాసన మండలి రద్దును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో చర్చ జరిగిందని, దీనిపై అన్ని వర్గాల సహాలు, సూచనలు తీసుకుంటేనే మంచిదనే ఉద్దేశంతో సమయం ఇచ్చామన్నారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమానికి పాటుపడుతుంటే, మండలిలో ఉన్న మెజార్టీతో ప్రజాసంక్షేమానికి ప్రతిపక్షం అడ్డుపడుతోందని ఆరోపించారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్ను నియమించడం దుర్మార్గమని ఆరోపించారు. ప్రజల సంపూర్ణ మద్దతు తమవైపు ఉందని, జగన్ పద్దతి ప్రకారమే ముందుకెళ్తున్నారని అన్నారు.