బాబోయ్ ఇలా నీటిని నింపుతున్నారా..?
By తోట వంశీ కుమార్ Published on 3 July 2020 6:02 AM GMT![బాబోయ్ ఇలా నీటిని నింపుతున్నారా..? బాబోయ్ ఇలా నీటిని నింపుతున్నారా..?](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/07/Untitled-4-copy-2.jpg)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో నీటికి ఇబ్బందులు ఉన్నాయి. దీంతో వారంతా ట్యాంకర్లపై ఆధారపడుతుంటారు. జలమండలి ద్వారా సరఫరా అయ్యే నీటిని శుద్ధ జలంగా బావిస్తారు. ఆ నమ్మకంతో ట్యాంకర్లను బుక్చేస్తారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే.. ట్యాంకర్లు బుక్ చేసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.
వివరాల్లోకి వెళితే.. మూసాపేట జనతానగర్లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం పక్కనే జలమండలి ట్యాంకుతో పాటు ఫిల్లింగ్ కేంద్రం ఉన్నాయి. చుట్టు ప్రక్కల ప్రజలకు బుక్కింగ్ పద్దతిన నీటిని సప్లై చేస్తున్నారు. గురువారం ఓ ఇంటి యజమాని ట్యాంకర్ను బుకింగ్ చేసుకున్నాడు. ట్యాంకర్లో నీటిని నింపుతున్న సమయంలో ఆ ట్యాంకర్ డ్రైవర్ పలుమార్లు లోపల పడుతున్న నీటితో కాళ్లు కడిగాడు. ఓ వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. క్షణాల్లో ఈ వీడియో వైరల్గా మారింది.
వెంటనే జలమండలి ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ట్యాంకర్ యజమానిపై చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి ట్యాంకర్ను అనుమతించకుండా బ్లాక్లిస్టులో చేర్చినట్లు ప్రాంతీయ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.