తమిళనాడులో ఘోరం.. అక్కాచెల్లెళ్లపై 16 మంది గ్యాంగ్‌ రేప్‌

By అంజి  Published on  16 Feb 2020 11:04 AM GMT
తమిళనాడులో ఘోరం.. అక్కాచెల్లెళ్లపై 16 మంది గ్యాంగ్‌ రేప్‌

తమిళనాడు రాష్ట్రంలో ఒళ్లు గగుర్పుడుచే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై 16 మంది కామ మృగాలు దారుణానికి తెగబడ్డాయి. విల్లుపురం జిల్లా దిండివనంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యచారా బాధితుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

వివరాల్లోకి వెళ్తే.. తెన్‌ర్కుండ్రం గ్రామానికి చెందిన భార్యభర్తలకు 8,10 సంవత్సరాల వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొన్నాళ్లకు భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఇద్దరు విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. కాగా కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇద్దరు చిన్నారులు తల్లి వద్ద ఉంటున్నారు. కాగా కొన్ని రోజుల తర్వాత ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో ఇద్దరు కూతుళ్లను తన అమ్మ దగ్గర ఉంచి.. భర్తతో కలిసి పాండిచ్చేరి వెళ్లిపోయింది.

ఆ సమయంలోనే ఇద్దరు బాలికలపై 16 మంది గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడ్డారు. అయితే ఈ 16 మందిలో బాలికల బంధువులు కూడా ఉన్నారు. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించడంతో..జరిగిన ఘటనను బాలికలు ఎవరికి చెప్పుకోలేకపోయారని తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు తల్లి.. తన పిల్లలిద్దరిని తనతో పాటు తీసుకెళ్లి ఓ స్కూల్‌లో జాయిన్‌ చేసింది. ఆమె చిన్న కుమార్తె స్కూల్‌లో చదువుకుంటుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది.

కాగా బాలికకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. అత్యాచారం జరగడం వల్లే బాలిక అస్వస్థతకు గురైందని వైద్యులు గుర్తించారు. ఆమె అక్కకు కూడా పరీక్షలు చేయించడంతో.. ఇద్దరిపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది. ఇదే విషయమై తల్లి ఆరా తీయగా.. బాలికలపై గ్యాంగ్‌ రేప్‌ జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై బాధిత చిన్నారుల తల్లి ఫిర్యాదు మేరకు విల్లుపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 16 మంది నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఆ తర్వాత వారికి బెయిల్‌ మంజూరు కావడంతో విడిచిపెట్టారు.

ప్రస్తుతం కేసు విచారణ దశలోనే ఉంది. మరోవైపు బాలిక తల్లి తరచూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయిస్తోంది. ఈ క్రమంలోనే గురువారం బాత్రూమ్‌కి వెళ్లిన ఆమె చిన్న కుమార్తె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తుండగానే బాలిక ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు మరో కేసు నమోదు చేసుకున్నారు. చిన్నారిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ రిపోర్టు ఆధారంగానే ముందుకు వెళ్తామని పోలీసులు చెప్పారు. నిందితలు కఠినంగా తల్లి డిమాండ్‌ చేస్తోంది.

Next Story