పవన్ గుప్తా పిటిషన్ కొట్టేసిన సుప్రీం.. రేపే 'నిర్భయ దోషుల'కు ఉరి.!
By అంజి Published on 2 March 2020 6:04 AM GMTముఖ్యాంశాలు
- నిర్భయ దోషి పవన్ గుప్తా పిటిషన్ కొట్టివేత
- పవన్గుప్తా క్యూరేటివ్ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
- ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని పిటిషన్ వేసిన పవన్
ఢిల్లీ: నిర్భయ దోషి పవన్ గుప్తా పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని పవన్ గుప్తా.. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు బెంచ్ ప్రత్యేకంగా సోమవారం విచారణ చేపట్టింది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు మార్చి 3వ తేదనీ ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ పిటిషన్పై జస్టిస్ రమణ, అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమన్, భానుమతి, అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం వాదనలు వినిపించింది. పిటిషన్లో విచారించాల్సిన అంశాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా ఇప్పటి వరకు నిందితుల్లో ముగ్గురు న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. తాజాగా పవన్ గుప్తా కూడా తన క్యూరేటివ్ పిటిషన్ను వినియోగించుకున్నాడు.
ఉరి నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు గత కొన్ని రోజుల డ్రామాలు ఆడుతున్నారు. పిటిషన్లు వేస్తూ కాలయాపన సాగిస్తున్నారు. ఉరికి ముందు ఆరోగ్యంగా ఉండాలన్న నిబంధనను తోసిపుచ్చి గాయాలు చేసుకుంటూ, అనారోగ్యానికి గురవుతున్నారు. దోషులు ఇప్పటికీ ఉరిని వాయిదా వేసేలా పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. దోషులు ఇప్పటి వరకూ తమ ముందున్న న్యాయ అవకాశాలను ఉపయోగించుకొని రెండు సార్లు ఉరి వాయిదా పడేలా చేశారు. ఇటీవల తీహార్ జైల్లో వినయ్ శర్మ ఆత్మహత్యకు యత్నించాడు. తనను ఉంచిన సెల్లో గోడకు వినయ్ తలబాదుకొని గాయపరుచుకున్నాడు.
కాగా, 2012, డిసెంబర్ 16న ఓ విద్యార్థిపై కదులుతున్నబస్సులు ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చివరకు కన్నుమూసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు నిర్భయగా నామకరణం చేశారు. ఈ ఘటనలో నిందితులైన, వినయ్, రామ్ సింగ్, అక్షయ్కుమార్, పవన్, ముఖేష్, మరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని తీహార్ జైలుకు తరలించగా, 2013లో ఓ నిందితుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్గా భావించి మూడు సంతవ్సరాలపాటు జైలు శిక్ష విధించి విడుదల చేశారు. కేసు విచారించిన కోర్టు, కాగా మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది.