టెస్ట్ల్లోనూ రోహి(ట్)త్..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Oct 2019 3:29 PM GMTకొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి..ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి..అనే తెలుగు పాటను టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎప్పుడైనా విన్నాడేమో తెలియదు .కానీ ..అతడి ఆట చూస్తుంటే మాత్రం ఈ మధ్య కాలంలో అలానే సాగుతోంది. ఇంగ్లండ్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో మొదలైన అతడి శతకాల పరంపర సొంతగడ్డపైనా అదే ఊపుతో కొనసాగుతోంది. తాజాగా రాంచీలో దక్షిణాఫ్రికాపై రోహిత్ సాధించిన డబుల్ సెంచరీతో అనేక పాత రికార్డులు గల్లంతయ్యాయి.
సహజశైలికి పదును పెట్టిన రోహిత్..!
భారత ఇన్నింగ్స్ను ఓపెన్ చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో ఒత్తిడితో కూడకున్నది. ఎందుకంటే సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజ ఓపెనర్ల ఆటను చూసిన అభిమానులు ఆ స్థానంలో ఎవరాడిన ఆ స్థాయి ఆటనే ఆశిస్తారు. పైగా ఆ దిగ్గజ త్రయం తమ అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును అనేక మ్యాచ్ల్లో ఒంటిచేతితో గెలిపించి అభిమానులకు మరవలేని జ్ఞాపకాలను అందించారు. ఇప్పుడా బాధ్యతను భుజాలకు వేసుకున్న రోహిత్ శర్మ కూడా వారి బాటలోనే ముందుకు సాగుతున్నాడు. పిచ్ ఏదైనా బౌలర్ ఎవరైనా తనకు తెలిసిందే బాదుడే అన్నట్టు రోహిత్ మైదానంలో చెలరేగుతున్నాడు. వన్డే, టీ20ల్లో అతడి సత్తాపై ఎవరికి ఏ అనుమానులు లేవు. టెస్టుల్లో మాత్రం అతడు వన్డే ప్రపంచకప్ ముందువరకు ఇబ్బంది పడేవాడు. దానికి ప్రధాన కారణం టెస్టుల్లో తన ఆటతీరును మార్చుకోవడమే. దూకుడుకు మారుపేరైన రోహిత్ సంప్రదాయ టెస్టు క్రికెట్కు వచ్చేసరికి తనశైలికి భిన్నంగా నిదానంగా ఆడడం..వికెట్ను కాపాడుకోవడానికి ప్రాధాన్యమివ్వడంతో అతడి అసలైన ఆట టెస్టుల్లో దెబ్బతింది. ఆ ఆత్మరక్షణ ధోరణి నుంచి ఇప్పుడు బయటపడి స్వేచ్ఛగా ఆడుతుండడంతో టెస్టులో కూడా రోహిత్ తుఫాను మొదలైంది. అతడి బ్యాటింగ్ ఊచకోతకు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తాజా సిరీస్ ఓ మంచి ఉదాహరణ.
ఈ సిరీస్ లో రోహిట్
ఈ సిరీస్లో మూడు టెస్టుల్లో నాలుగుసార్లు బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రోహిత్ చేసిన (176, 127, 14, 212) స్కోర్లు ఇవి. టెస్టుల్లో అతడు ఆడిన చివరి తొమ్మిది ఇన్నింగ్స్లో ఎనిమిదిసార్లు 50కు పైగా పరుగులు సాధించి సంప్రదాయ క్రికెట్కు పనికిరాడని వేనోళ్లతో విమర్శించిన క్రిటిక్స్కు రోహిత్ దీటుగా బదులిచ్చాడు. దీంతో ప్రపంచకప్ ముందు వరకు వన్డే, టీ20 స్పెషలిస్ట్ ఓపెనర్గా ఉన్న రోహిత్ శర్మ.. తాజా ప్రదర్శనతో టెస్టుల్లో కూడా తన ఓపెనింగ్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
రోహిత్ రికార్డులు
ఓపెనర్గా బరిలోకి దిగి వన్డేలు, టెస్టుల్లో డబుల్ సెంచరీలు నమోదు చేసిన జాబితాలో రోహిత్ స్థానం సంపాదించాడు. ఇప్పటివరకు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్ మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజాగా రోహిత్ కూడా ఈక్లబ్లో చేరాడు. ఒకే సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రోహిత్ 529 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా 491 పరుగులతో సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఒకే సిరీస్లో 3 ద్విశతకాలు...
దాదాపు 64 ఏళ్ల తర్వాత ఒక టెస్టు సిరీస్లో భారత బ్యాట్స్మెన్ మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసి గత రికార్డును సమం చేశారు. 1955-56లో న్యూజిలాండ్తో ద్వైపాక్షిక సిరీస్లో వినోద్ మన్కడ్ రెండు ద్విశతకాలు చేయగా పాలీ ఉమ్రగర్ ఒక డబుల్ సెంచరీ బాదాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్లో మయాంక్ అగర్వాల్ (215), విరాట్ కోహ్లీ (254), రోహిత్ శర్మ (212) డబుల్ టన్స్ సాధించి ఆ రికార్డును తిరగరాశాడు.
- సంజయ్ .హెచ్, స్పోర్ట్స్ ఎనలిస్ట్