ప్రగతిభవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం..అడ్డుకున్న పోలీసులు
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Oct 2019 9:01 AM GMTహైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచిన విద్యార్థి సంఘాలు ప్రగతిభవన్ ముట్టడికి బయల్దేరాయి. ఓయూ నుంచిర్యాలీగా వెళ్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీలో తెలంగాణ విద్యార్థి యూనిట్, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ర్యాలీగా వస్తున్న విద్యార్థులను ఎన్సీసీ గేట్ ఎదుట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడాన్ని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రగతిభవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు విద్యార్థుల ఐక్య కార్యాచరణ సమితి ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.