చంద్రబాబుపై 'చింత'నిప్పులు చెరిగిన శ్రీకాంత్ రెడ్డి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Nov 2019 10:58 AM GMT
చంద్రబాబుపై చింతనిప్పులు చెరిగిన శ్రీకాంత్ రెడ్డి..!

ముఖ్యాంశాలు

  • చంద్రబాబు కాదు స్టేల బాబు :శ్రీకాంత్ రెడ్డి
  • చంద్రబాబు సెక్యులర్ అని చెప్పుకోగలరా?:శ్రీకాంత్ రెడ్డి
  • స్టేలు తొలగించుకుని బాబు విచారణకు సిద్ధం కావాలి :శ్రీకాంత్ రెడ్డి

అమరావతి:

కులమతాలు రెచ్చగొట్టే విధంగా కుట్రలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు ప్రభుత్వ చీఫ్ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి. టీడీపీ నేతల దౌర్జాన్యాలపై కేసులు పెట్టకూడదా ?అని ప్రశ్నించారు.మొన్నటివరకు ఇసుకపై రాద్ధాంతం చేశారని..ఇప్పుడు ఇంగ్లీషు విషయంలో బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పోలీసులను సైతం చంద్రబాబు బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాంత్ రెడ్డి.

పోలీసు అధికారులను బెదిరించే ధోరణిలో చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి వదిలేయమని చంద్రబాబు పోలీసులకు చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో చట్ట ప్రకారం పోలీసులు పని చేస్తున్నారని చెప్పారు. చట్టానికి అందరూ సమానమేనన్నారు. వైఎస్ఆర్ సీపీలో ఎంత పెద్ద వ్యక్తి తప్పు చేసినా చర్యలు తప్పవన్నారు. టీడీపీ నేతలు తప్పులు చేస్తూ..హత్యా రాజకీయాలు చేస్తుంటూ చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు శ్రీకాంత్ రెడ్డి.

18 కేసులున్న చింతమనేని 'బాబా'గా బాబు అభివర్ణించడంపై శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరాచకాలను ప్రోత్సహించే విధంగా చంద్రబాబు మాటలు ఉన్నాయన్నారు. చింతనిప్పులా ఉండే చింతమనేని ప్రభాకర్‌ పై కేసులు పెడతారా అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించడాన్ని కూడా శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు.

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి,లంచం ఉండవని గర్వంగా చెబుతున్నామన్నారు శ్రీకాంత్ రెడ్డి. సిఫార్సులు ఉండవన్నారు. అధికారం అందరిది కొందరిది కాదన్నారు శ్రీకాంత్ రెడ్డి. నిరుద్యోగయువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం.సచివాలయాలలో వాలంటీర్లతో కలుపుకుని నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.ప్రతి జనవరిలో రిక్రూట్‌ మెంట్‌ క్యాలండర్‌ ప్రకటిస్తున్నామన్నారు శ్రీకాంత్ రెడ్డి.

బీజేపీని వదలనని 2004లో చంద్రబాబు ప్రకటించారని..2009లో మతతత్వ పార్టీ అని ముద్రవేశారని చెప్పారు. 2014 బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచి, 2018 మళ్లీ మోదీని తిట్టారని చంద్రబాబుకు గుర్తు చేశారు శ్రీకాంత్ రెడ్డి.2019 ఎన్నికలలో సైతం నీదైన ఇంగ్లీషు లో మోదీని తిట్టింది గుర్తు చేశారు. .ఎన్నికలయ్యాక తిరిగి నరేంద్ర మోది కాళ్లు పట్టుకున్నావని హేళన చేశారు శ్రీకాంత్ రెడ్డి. ఈ రోజుకి సెక్యులర్‌ వాదినని చంద్రబాబు గట్టిగా చెప్పుకోలేక పోతున్నారని తెలిపారు శ్రీకాంత్ రెడ్డి. గత ఎన్నికల్లో 23 స్దానాలు కూడా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు బాధ పడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

చంద్రబాబుపై ఏ కేసు వచ్చిన హడావుడిగా వెళ్లి స్టేలు తెచ్చుకుంటారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ..నిజంగా నిప్పు అని భావిస్తే ఉన్న కేసుల్లో స్టేలు తొలగించుకుని ..విచారణకు సిధ్దం కావాలన్నారు. .ప్రపంచంలోనే అవినీతిపరుడు చంద్రబాబు అని నిరూపణకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు శ్రీకాంత్ రెడ్డి.

Next Story