నీరజ్‌తో ఒలింపిక్స్‌ వేళ ఈ విషయాలే మాట్లాడా: మను బాకర్

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మను బాకర్‌ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  10 Sep 2024 7:15 AM GMT
నీరజ్‌తో ఒలింపిక్స్‌ వేళ ఈ విషయాలే మాట్లాడా: మను బాకర్

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మను బాకర్‌ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆమె భారత ప్రతిష్టను ప్రపంచ దేశాలను చాటి చెప్పారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్‌ను సాధించి రికార్డును నెలకొల్పారు. అయితే.. పారిస్ ఒలింపిక్స్‌ ముగింపు వేళ నీరజ్ చోప్రాతో మను బాకర్‌ కలిసి మాట్లాడింది. వీరు ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మను బాకర్‌ ఆ రోజు నీరజ్‌ చోప్రాతో ఏం మాట్లాడిందో ఆ విషయాలను పంచుకుంది. ఒక జాతీయ మీడియా చానెల్‌లో ఈ విషయాలను యంగ్‌ షూటర్‌ మను భాకర్ చెప్పారు.

చరిత్ర సృష్టించిన చాలా మందితో చాలా మాట్లాడారు, అందులో ఏది ప్రత్యేకం అని అడగ్గా.. నీరజ్‌తో భేటీనే అని మను బాకర్ చెప్పింది. పారిస్ ఒలింపిక్స్‌ తర్వాత నీరజ్‌తో కొన్ని విషయాలను మాట్లాడానని అన్నది. అతను జీవితంలో ఎన్నో విజయాలను అందుకున్నాడని.. చాలా మందికి స్ఫూర్తిగా ఉన్నాడని పేర్కొంది. పోటీవేళ ఆటగాళ్లపై ఎంతో ఒత్తిడి ఉంటుందని చెప్పింది. మానసిక బలం ప్రాధాన్యంపై నీరజ్‌తో చర్చించినట్లు మనూ పేర్కొంది. ఆ సంభాషణ తనను ఎంతో ప్రభావితం చేసిందని చెప్పారు. అథ్లెట్లు ఒక లాంటి అనుభవాలు, సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు నీరజ్‌తో మాట్లాడిన తర్వాత అర్థం అయ్యిందని మను భాకర్ తెలిపింది.

ఇక పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సందర్భంలో తాను ఎంతో సంతోషంగా ఫీల్‌ అయినట్లు చెప్పింది. ఆ క్షణంలో భావోద్వేగం, దేశానికి ప్రాతినిథ్యం వహించడం వంటి విషయాలు గొప్పగా అనిపించాయని చెప్పింది. ఇక తల్లిదండ్రులు, మిత్రుల నుంచి తనకెంతో సహకారం అందిందని మను బాకర్ తెలిపింది. తాను షూటర్‌ కాకపోతే.. టీచర్‌ అయ్యేదాన్ని అని ఆమె వెల్లడించింది. ఇక చీట్‌ మీల్‌ కింద పిజ్జా తినడమంటే తనకు చాలా ఇష్టమనీ... బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తనకు రోల్‌మోడల్‌ అని మను బాకర్‌ చెప్పుకొచ్చింది.

Next Story