ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం, ఫైనల్‌కు రెజ్లర్ వినేశ్ ఫోగట్

పారిస్ ఒలిపింక్స్ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. అథ్లెట్లు అదరగొడుతున్నారు.

By Srikanth Gundamalla  Published on  7 Aug 2024 2:30 AM GMT
paris olympics, wrestling, vinesh phogat,  final,

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం, ఫైనల్‌కు రెజ్లర్ వినేశ్ ఫోగట్

పారిస్ ఒలిపింక్స్ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. అథ్లెట్లు అదరగొడుతున్నారు. చివరి వరకు వెళ్లిన భారత అథ్లెట్లు కొందరు విఫలమై.. నిరాశతో వెనుదిగారు. తాజాగా ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పథకం ఖాయం అయ్యింది. అంచనాలను అందుకుంటూ భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో ఫైనల్ చేరింది. సెమీఫైనల్‌లో క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్‌మాన్‌తో తలపడిన వినేశ్ ఫొగట్‌ ఘనవిజయాన్ని అందుకుంది. 5-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచే ఫోగట్ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో తొలి పిరియడ్‌ ముగిసే సమయానికి ఫోగట్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో పీరియడ్‌లో ఆమె 5-0తో భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు అలాగే కొనసాగించడంతో బౌట్ భారత వశమైంది. ఫైనల్‌ పోరుకు వినేశ్ ఫొగట్ సిద్ధం అవుతోంది. అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాండ్‌తో వినేశ్ ఫొగట్ తలపడనుంది. మరోవైపు అమెరికాకు చెందిన హిల్డెబ్రాండ్ట్ సెమీఫైనల్‌లో మంగోలియాకు చెందిన డోల్గోర్జావిన్‌పై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది.

కాగా వినేశ్ ఫొగట్ రౌండ్-16 బౌట్‌లో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన జపాన్ క్రీడాకారిణి యుయి సుసాకిని మట్టి కరిపించింది. దాదాపుగా సుసాకి విజయం ఖాయం అనుకున్నారు అంతా. కానీ.. ఆమెను ఘోరంగా ఓడిచడంతోనే వినేశ్ ఫొగట్‌ పతకానికి దారి క్లియర్ అయ్యింది. సుసాకీ అంతర్జాతీయ ఈవెంట్‌లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఆమె ఆడిన 82 బౌట్‌లు అన్నింటినీ విజయం సాధించింది. అలాంటి ప్రత్యర్థిని వినేశ్ ఓడించి సంచలనం సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది. ఆరంభంలో 0-2తో వెనుకబడినప్పటికీ.. చివరి 3-2తో బౌట్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత క్వార్టర్‌ఫైనల్స్‌లో ఉక్రెయిన్‌ క్రీడాకారిణి ఒక్సానా లివాచ్‌‌పై 7-5 తేడాతో ఫోగట్ విజయం సొంతం చేసుకుంది.

Next Story