చికెన్పై అదిరే ఆఫర్లు.. కొందరు ఎగబడుతుంటే.. మరికొందరు మాత్రం..
By అంజి Published on 12 March 2020 4:22 AM GMTఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా వైరస్ వదంతుల నేపథ్యంలో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలయింది. చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ సోకుతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు వార్తలు రావడంతో.. జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. కాగా ఫామ్స్లో ఉన్న కోళ్ల అమ్మకానికి పూర్తిగా గిరాకీ పడిపోయింది. గత రెండు నెలల క్రితం చికెన్ ధర 160 రూపాయలు ఉండగా.. నేడు 30 రూపాయలకు పడిపోయింది. ఇలా ఒక్కసారిగా రెట్లు తగ్గడంతో రైతులు భారీగా నష్టాల పాలవుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ క్రాస్ రోడ్లో 20 రూపాయలకు కిలో చికెన్ అంటూ బోర్డులు పెట్టి మరీ చికెన్ అమ్ముతున్నారు. ఆఫర్లు పెట్టి మరీ చికెన్ అమ్మిన జనాలు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తాజాగా మేళ్ల చెరువు మండలం రామాపురంలో దాణా ఖర్చు అయినా మిగులుతుందని రైతు సూర్యప్రకాష్.. ఫామ్లో ఉన్న నాలుగు వేల కోళ్లని గ్రామస్తులకు ఉచితంగా ఇచ్చేశాడు.
ఇదిలా ఉంటే.. మిర్యాలగూడలోని ఓ చికెన్ సెంటర్లో పురుగులు ఉన్న కోడి విజువల్స్ వెలుగులోకి రావడంతో ప్రజలు చికెన్ పేరు పలకడానికి భయపడుతున్నారు. ఓ వ్యక్తి చికెన్ కోసం షాప్కు వెళ్లగా.. అక్కడ షాప్ యాజమాని చికెన్ కట్ చేస్తుండగా వందలాది పురుగులు కనిపించడంతో వ్యక్తి సహా షాప్ యాజమాని షాక్కు గురయ్యాడు.. ఈ ఫొటోలను చూసి చికెన్ ప్రియులు సైతం.. చికెన్ను అసహ్యించుకుంటున్నారు. చికెన్ తినడానికి జంకుతున్న ప్రజలకు.. కూరగాయాలు ధరలు సైతం భయపెడుతున్నాయి. చికెన్ ధరలు తగ్గడంతో కూరగాయాల మార్కెట్ నిర్వహకులు.. కూరాయాల రేట్లను అమాంతం పెంచేశారు. దీంతో ప్రజలు కూరగాయాలు కొనేందుకు సైతం ఆలోచిస్తున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై చూపుతోంది. ఇప్పటికే పలు దేశాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ప్రజలు మాంసం తినేందుకు భయపడుతుండండంతో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. కరోనా వైరస్ ప్రభావంతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కరోనా వైరస్ అంటూ వ్యాధి కాదని రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. చికెన్ తినడం వల్ల కరోనా రాదని నిపుణులు, వైద్యులు ఎంత చెప్తున్నా.. జనాల చెవుల్లోకి మాత్రం వెళ్లడం లేదు. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే చికెన్ వ్యాపారులు మాత్రం.. నష్టం వచ్చినా సరే అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు.