అసెంబ్లీ స్పీకర్ వివాదస్పద వ్యాఖ్యలు
By సుభాష్ Published on 4 Jan 2020 8:27 AM GMTగుజరాత్ అసెంబ్లీ స్పీకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసిన ఘనత అంబేద్కర్ ది కాదని, బ్రాహ్మణ కులానికి చెందిన బెనగళ్ నరసింహరావుది అని ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యాంగముసాయిదాను తయారు చేసిన ఇతన్ని చూసి బ్రాహ్మణులు ఎంతో గర్వపడాలని ఆయన అన్నారు. శుక్రవారం రాత్రి గాంధీనగర్లో జరిగిన మెగా బ్రాహ్మణ బిజినెస్ సమ్మిట్ కార్యక్రమంలో స్పీకర్ రాజేంద్రత్రివేది ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. రాజ్యాంగ రచన కమిటీకి బీఆర్ అంబేద్కర్ చైర్మన్ కావడం కారణంగా ఆయన క్రిడిట్ ఆయనకు దక్కిందన్నారు. ఇక భారత దేశం తరపున నోబెల్ బహుమతులు అందుకున్న 9 మందిలో 8 మంది బ్రాహ్మణులే ఉన్నారన్నారు.
ఇటీవల బహుమతి గెలుచుకున్న అబిజిత్ బెనర్జీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ రాజేంద్ర త్రివేది చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రాజ్యాంగమైన పదవిలో ఉండి స్పీకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని పలువురు మండిపడుతున్నారు.
నవంబర్ 25, 1949లో జరిగిన సమావేశంలో బీఆర్ అంబేద్కర్ ఈ విషయాన్ని తెలియజేశారని, బ్రహ్మణులకు క్రిడిట్ దక్కించిన అంబేద్కర్ పట్ల ఎంతో సంతోషంగా ఫీలవుతున్నట్లు స్పీకర్ చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 11 మందిని కాపాడిన రాజేశ్ శుక్లా కూడా బ్రహ్మణ కులానికి చెందినవాడేనని స్పీకర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వేదికపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రిలు ఉన్న సమయంలో స్పీకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.