వారిద్దరు జట్టులో అవసరం లేదు : గంగూలీ
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 Sep 2019 5:58 AM GMTటీ20, 50 ఓవర్ల క్రికెట్లో టీమిండియా పటిష్టంగా ఉండాలంటే స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్లను తిరిగి జట్టులోకి తీసుకోవాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ప్రస్తుతం యువ క్రికెటర్లను పరీక్షించాలనే ఉద్దేశంతో చహల్ను పక్కకు పెట్టినప్పటికీ, టీ20 ఫార్మాట్లో అతని అవసరం చాలా ఉందన్నాడు.
వచ్చే ఏడాది వరల్డ్ టీ20 జరుగనున్న నేపథ్యంలో కుల్దీప్ యాదవ్, చహల్లు ఎంతో ముఖ్యమన్నాడు. వీరిద్దరూ జట్టులో ఉంటే భారత జట్టు మరింత బలోపేతం అవుతుందన్నాడు. అలాగే టీ20 వరల్డ్కప్లో విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నానన్నాడు. ఆ వరల్డ్కప్ కోహ్లికి చాలా ముఖ్యమైనదని గంగూలీ తెలిపాడు.
అదే సమయంలో భారత జట్టులో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యాలు అవసరం లేదన్నాడు. వీరిలో ఎవరో ఒకరు ఉంటే సరిపోతుందన్నాడు. ఆ ఇద్దర్నీ ఒకే మ్యాచ్ తుది జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తించాలన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్లో టీమిండియా రాణిస్తుందని గంగూలీ అన్నాడు.