23న 'దాదా' చేతికి ప‌గ్గాలు.. విరాట్ కెప్టెన్సీ ఉంటుందా.? ఊడుతుందా.?

By Medi Samrat  Published on  16 Oct 2019 6:57 AM GMT
23న దాదా చేతికి ప‌గ్గాలు.. విరాట్ కెప్టెన్సీ ఉంటుందా.? ఊడుతుందా.?

బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సార‌థి, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యాడు. ఈనెల 23వ తేదీన బాధ్యతలు తీసుకోవడానికి అధికారికంగా రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియాలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయన్న చర్చ సాగుతోంది.

ఇన్నాళ్లు బీసీసీఐ పాలన సీఓఏ చేతుల్లో ఉంది. దీంతో టీమిండియా ప్రదర్శనపై సమీక్షించే పరిస్థితి లేకుండా పోయింది. అంతా విరాట్ కోహ్లీ - కోచ్ రవిశాస్త్రి కనుసన్నల్లోనే టీమిండియాలోకి ఆటగాళ్ల ఎంపిక - ప్రదర్శన చేసినా చేయకున్నా వారిని తీసుకోవడం జరిగింది.

అయితే భారత జట్టు 2013 తర్వాత చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవలేదు. విరాట్ కోహ్లీ సారథ్యంలో అయితే దేశంలో విదేశాల్లో అద్భుతంగా ఆడడం.. తీరా ప్రపంచకప్ ల వరకూ వచ్చేవరకు ఘోరంగా విఫలమవుతున్నారు. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా వరల్డ్ కప్ లోనూ గెల‌వ‌లేదు. విరాట్ కోహ్లీ సారథ్యంలో ప్రపంచకప్ టోర్నీల‌లో జట్టు నిరాశే పరిచింది.

అయితే.. ఇటీవల ప్రపంచకప్ టోర్నీలో ఓడిన భారత జట్టును గంగూలీ తీవ్రంగా విమర్శించాడు. వరుసగా ఏడు ఐసీసీ టోర్నీల‌లో జట్టు వైఫల్యాలను ఎత్తి చూపాడు. విరాట్ తప్పుకోవాలన్న డిమాండ్ ను వినిపించాడు. దీంతో పాటు జట్టు కూర్పు - ఎంపికపై కూడా విమర్శలు చేశారు. అంబటిరాయుడు లాంటి వాళ్లను దూరం పెట్టిన విధానాన్ని గంగూలీ ప్రశ్నించాడు. ఇప్పుడు బీసీసీఐ చీఫ్ గా గంగూలీ ఎన్నికవ్వడంతో భారత క్రికెట్ కు మంచిరోజులు వచ్చినట్టేనన్న చర్చ సాగుతోంది.

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎంపిక‌ కావడంతో.. ఇక జట్టు ఎంపికలో.. చివరకు కెప్టెన్ విరాట్ కోహ్లీ అధికారాలకు కత్తెర పడే అవకాశం ఉంది. అంతేకాక విరాట్ ను తప్పించి కొత్త కెప్టెన్ ను పరీక్షించే అవకాశాలు లేకపోలేదు.. తాజాగా మీడియా సమావేశంలోనూ గంగూలీ హాట్ కామెంట్స్ చేశారు. ఐసీసీ టోర్నీలు గెలిచి ఇండియా చాలా కాలమైందని.. విరాట్ కోహ్లీ తగిన జాగ్రత్తలు తీసుకొని పరిస్థితిని మార్చాలని గంగూలీ స్పష్టం చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీన్ని భారత క్రికెట్ జట్టు ప్రక్షాళనతోపాటు విరాట్ కు గంగూలీ ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నారు.

Next Story