కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ పాట
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 9:51 AM GMTతెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ అసోసియేషన్ వారు ఒక పాటని రూపొందించటం జరిగింది. ఈ పాటని సంగీత దర్శకులతో పాటు, గాయనీ గాయకులు 30 మంది పాడుతున్నారు. ఈ పాటకి సంబందించిన ముందుమాటని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్ అందించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, సంగీత దర్శకులు బల్లేపల్లి మోహన్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పై ఒక అద్బుతమైన పాటని సంగీత దర్శకుడు భోలే శావలి స్వరపరచగా, మరో సంగీత దర్శకుడు వెంగి చక్కని సాహిత్యాన్ని అందించడం జరిగిందన్నారు. తెలంగాణ మ్యుజీషియన్స్కి ఎన్నో సమస్యలున్నాయి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని, కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ కొండంత అండగా ఉంటుందని, అదే విధంగా ఈ పాట కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద వీడీయో చిత్రీకరణ చేసి తొందరలోనే విడుదల చేయడం జరుగుతుందని వినోద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంగీత దర్శకులు బల్లేపల్లి మోహన్తో పాటు పలు సంగీత దర్శకులు, గాయనీ గాయకులు పాల్గొన్నారు.