ఉద్యమాల ఊసా కరోనాతో కన్నుమూత
By సుభాష్ Published on 25 July 2020 7:47 AM
ఉద్యమాల ఉపాధ్యాయుడు, బహుజన సాహితీవేత్త, సామాజిక కార్యకర్త యూ. సాంబశివరావు అలియాస్ ఊసా కరోనాతో కన్నుమూశారు. రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థలకు గురైన ఆయన ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ వచ్చింది. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య క్షిణించడంతో మృతి చెందారు. ఊసా మృతి పట్ల ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున స్పందించారు. ఆయన మరణం బహుజన ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.
అయితే తెలుగు నేలపై పురుడు పోసుకున్న ఉద్యమాలకు పెద్ద దిక్కుగా ఉన్నారు. దళిత, బహుజనులపై వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా బహుజన రాజ్యాధికారి సాధనకై ఆయన నిరంతరం పని చేస్తున్నారు. అరవై ఏళ్ల వయసులోనూ యువతతో మమేకం అవుతూ ఎన్నో సిద్దాంతాలను వారికి పూసగుచినట్లు వివరించేవారు. విప్లవ, బహుజన రాజకీయాల పట్ల సమగ్ర అవగాహనతో ముందుచూపుతో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 1985లో కారంచేడులో దళిత నరమేధం సందర్భంగా కమ్మ భూస్వాముల దాడి అంటూ ధిక్కరణ స్వరంతో కరపత్రం రాశారు. అలాంటి ఊసా కరోనాతో మృతి చెందడంతో తెలుగు నేలపైఎంతో మందిని శోకసముద్రంలో ముంచివేసింది.