ముగిసిన షిర్డీ వివాదం

By అంజి  Published on  21 Jan 2020 2:30 AM GMT
ముగిసిన షిర్డీ వివాదం

షిర్డీ సాయిబాబా జన్మస్థల వివాదానికి తెరపడింది. అభివృద్ధి పనులలో భాగంగానే పాథ్రీ కి నిధులు మంజూరు చేసినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక ముందు బాబా జన్మస్థలంగా పత్రిని పేర్కొనేది లేదని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని, ఇక వివాదం ముగిసినట్టేనని తేల్చి చెప్పారు. షిర్డీ ట్రస్టు ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారంనాడు సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం కమలాకర్ కోతే మీడియాతో మాట్లాడుతూ, షిర్డీ సాయిబాబా జన్మస్థలంగా పత్రిని ఇక ముందు పేర్కొనరాదని సమావేశం నిర్ణయించినట్టు చెప్పారు.

సాయిబాబా జన్మస్థలమైన పత్రి గ్రామాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇటీవల ప్రకటించడం వివాదానికి దారితీసింది. బాబా జన్మస్థలంగా పత్రిని ప్రకటించి, అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాశస్త్యం తగ్గిపోతుందని షిర్డీ గ్రామ ప్రజలతో పాటు, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. షిర్డీ నిరవధిక బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. శివసేనకు చెందిన స్థానిక నేతలు కూడా కూడా షిర్డీవాసుల బంద్‌కు మద్దతుగా నిలిచారు. తొలుత తాము షిర్డీ భక్తులమని, ఆ తర్వాతే చట్టసభలకు ఎన్నికయ్యామని గుర్తు చేశారు. పత్రిని బాబా జన్మస్థలంగా ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంత వరకూ తాము వెనక్కి తగ్గేదిలేదని షిర్డీవాసుల స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్టు ప్రతినిధులతో ఉద్ధవ్ థాకరే భేటీ కావడంతో పరిస్థితి సద్దుమణిగేందుకు మార్గం సుగగమైంది.

సాయిబాబా జన్మస్థలం పాథ్రీ అంటూ చేసిన స్టేట్​మెంట్​ను సీఎం వెనక్కి తీసుకున్నారని ప్రకటించారు. ఫాథ్రీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడంపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని ట్రస్టు ప్రతినిధులను సీఎం థాక్రే ప్రశ్నించారని, సాయిబాబా జన్మస్థలంపైనే తమ అభ్యంతరం అని, అభివృద్ధికి సంబంధించిన విషయంలో కాదని వారు చెప్పారని సమావేశం అనంతరం ఆ పార్టీ నేతలు తెలిపారు. సీఎం థాక్రేతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని, దీంతో నిరసనలు విరమించాలని నిర్ణయించినట్టు బీజేపీ ఎమ్మెల్యే విఖే పాటిల్​ చెప్పారు.

Next Story