ప్రధాని కోసం ప్రత్యేక సొరంగం..!
By అంజి Published on 6 Feb 2020 5:19 AM GMTదేశ ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీలో ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. త్వరలో ఆయన తన కార్యాకలాపాల నిమిత్తం.. పార్లమెంట్కు, పీఎంవోకు సొరంగ మార్గంలో ప్రయాణించనున్నారు. పార్లమెంట్, ప్రధాని కార్యాలయం, రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ భననాలను ఒకే సముదాయంలో నిర్మించేందుకు సెంట్రల్ విస్టా సరికొత్త ప్లాన్ను రూపొందిస్తోంది. ఇందుకు అణుగుణంగా పార్లమెంట్కు, పీఎంవోకు సొరంగ మార్గం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాజెక్ట్ రూపకర్త బిమల్ పటేల్ చెప్పారు. టన్నెల్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.
పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రధాని పార్లమెంట్ వెళ్తుండగా.. ట్రాఫిక్ ఇబ్బందులు తెలత్తుతున్నాయి. దీంతో ఇటూ ప్రధాని కాన్వాయ్.. అటూ ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యంత భద్రత కల్పించాల్సిన ప్రధాని వంటి వారిని ట్రాఫిక్ సమస్య నుంచి వేరు చేయాలనుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని, వీఐపీల కొరకు కొన్ని ప్రత్యేక రహదారులు ఏర్పాటు చేయాలని ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ తెలిపారు. ప్రస్తుత రక్షణ సిబ్బంది కార్యాలయాను తొలగిస్తామని.. ఎస్పీజీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
బుధవారం పార్లమెంట్ రీడిజైన్పై సీఈపీటీ వర్సిటీలో సమావేశం జరిగింది. ప్రధాని కోసం ప్రత్యేక టన్నెల్ నిర్మించడం ద్వారా.. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బిమాల్ పటేల్ తెలిపారు. ముందుగా ప్రాణహాని ఉన్న వీఐపీల జాబితాను తయారు వారినే ఈ టన్నెల్ ద్వారా పంపించేలా ఏర్పాటు చేయాలన్నారు. రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఉపరాష్ట్రపతి నివాసాన్ని నార్త్ బ్లాక్కు.. ప్రధాని నివాసాన్ని సౌత్బ్లాక్కు మార్చాలని ఆయన సూచించారు. ఈ ప్రాజెక్టు 2024 నాటికి పూర్తవుతుందని బిమల్ పటేల్ పేర్కొన్నారు.